- సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క
మహబూబ్నగర్, వెలుగు: అక్టోబర్ 2వ తేదీ నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ‘భారత్ జోడో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎల్పీ లీడర్భట్టి విక్రమార్క ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి, ఈడీ విచారణ పేరుతో సోనియాగాంధీ, రాహుల్ను వేధిస్తున్నారని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం పాస్ పోర్ట్ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ జిల్లా కమిటీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు.
ప్రజలకు అచ్చేదిన్ తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు నిత్యావసరాల ధరలను పెంచి ప్రజలు సచ్చేదిన్ తీసుకొచ్చిందని ఫైర్అయ్యారు. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయస్థానాలను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్కు చెందిన యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. గతంలో విచారణ చేసి ఏం లేదని తేల్చి కేసును మూసివేశారని అన్నారు.
రాహుల్ గాంధీ నిర్వహించనున్న పాదయాత్రతో బీజేపీ బండారం బయటపడుతుందని, తిరిగి ఈ కేసును పునఃప్రారంభించారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసి అడ్డంకులు సృష్టించినా భారత్ జోడో పాదయాత్రను ఆపడం మోడీ తరం కాదని అన్నారు. అంతకుముందు పార్టీ ఆఫీస్ నుంచి పాస్పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్ఒబేదుల్లా కొత్వాల్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఎంపీపీ కాంతమ్మ, లీడర్లు జి.మధుసూదన్రెడ్డి, ప్రదీప్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
