బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్

బంపరాఫర్ ..  రైతులకు సగం ధరకే ట్రాక్టర్
  • రైతులకు వరంగా ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన
  • యూనిట్​ ధరలో  50శాతం సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం
  • రూ.లక్షన్నర ఆదాయం మించొద్దు 
  • కౌలు రైతులూ అర్హులే..

మంచిర్యాల, వెలుగు :  వ్యవసాయ రంగంలో యంత్రాల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ కొంతమంది బడా రైతులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి.  చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయంలో ప్రధానమైన ట్రాక్టర్​ను కొనే స్థోమత లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తున్నది. లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్లను కొనుగోలు చేయలేని  రైతులకు ఈ పథకం వరంగా మారింది. 

50 శాతం చెల్లిస్తే ట్రాక్టర్​ సొంతం..

రైతులు ట్రాక్టర్​ ధరలో 50 శాతం చెల్లిస్తే చాలు ప్రధానమంత్రి ట్రాక్టర్​యోజన పథకం కింద నచ్చిన ట్రాక్టర్​ను సొంతం చేసుకోవచ్చు.  అది కూడా భరించలేని రైతులు వ్యవసాయ భూమిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి లోన్​ తీసుకోవచ్చు.  రైతు ఏ బ్యాంక్​లో లోన్​ తీసుకుంటాడో అదే బ్యాంక్​కు కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందజేస్తుంది. ట్రాక్టర్​ ధర రూ.8లక్షలు అనుకుంటే  రైతు రూ.4లక్షలు చెల్లించాలి. మిగతా రూ.4లక్షలను కేంద్రం భరిస్తుంది.  లోన్​ మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో బ్యాంక్​కు చెల్లిస్తే సరిపోతుంది. 

రూ.లక్షన్నర ఆదాయం ఉన్నవారికే..

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు  మించరాదు. అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.  గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ సబ్సిడీపై  ట్రాక్టర్​ కొనుగోలు చేయని రైతులకు ఇది వర్తిస్తుంది. కౌలు రైతులు సైతం ఈ స్కీం ద్వారా ట్రాక్టర్​ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.  వీరు భూ యజమానుల దగ్గరి నుంచి నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్​(ఎన్​వోసీ) తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఒక రైతు ఒక ట్రాక్టర్​ను మాత్రమే కొనే వీలుంటుంది. తనకు నచ్చిన కంపెనీ, నచ్చిన మోడల్​ను రైతులు ఎంపిక చేసుకోవచ్చు. ఏ ట్రాక్టర్​ కొనుగోలు చేయాలన్నది పూర్తిగా రైతుల ఇష్టమే. 

దరఖాస్తు చేయడం ఇలా.. 

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకానికి రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్​లైన్​లో https://pmkisan.gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, ఓటర్​ ఐడీ కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​, పాస్​పోర్టుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా సమర్పించాలి. వ్యవసాయ భూమికి సంబంధించిన అడంగల్​ పహాణీ, బ్యాంక్​ అకౌంట్​ వివరాలు, ఇన్​కమ్​ సర్టిఫికెట్​, లేటెస్ట్​ పాస్​పోర్టు సైజ్​ ఫొటోతో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా అనుమానాలుంటే హెల్ప్​లైన్​ టోల్​ఫ్రీ 155261, 011–24300606 నంబర్లలో  లేదా దగ్గరలోని ట్రాక్టర్​ డిస్ర్టిబ్యూటర్లను సంప్రదించాలి.

ఇప్పటివరకు 15 ట్రాక్టర్లు ఇచ్చాం

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన స్కీమ్​ చిన్న, సన్నకారు రైతులకు ఎంతో లాభదాయకం. ఈ పథకం కింద ఇప్పటివరకు మేం 15 ట్రాక్టర్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా రూ.4లక్షలు సబ్సిడీ ఇస్తుంది. ట్రాక్టర్​ కొనుగోలు చేసిన తర్వాత మూడు నెలల్లోపు సబ్సిడీ అమౌంట్​వస్తుంది. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. 
- దొమ్మటి అర్జున్​, కుబోటా ట్రాక్టర్స్​, మంచిర్యాల