
బీజేపీని చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతున్నాయి
ఎన్ని జిమ్మిక్కులు చేసినా మా సభ్యత్వాల్ని క్రాస్ చేయలేరు
బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి
ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా గెలుపు బీజేపీదేనని, టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం ఖాయమని బీజేపీ సీనియర్ లీడర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే ఆ రెండు పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ ముందుకు ఏ బిల్లు వచ్చినా ప్రతిపక్షాల మద్దతును అధికార పార్టీ కోరడం సహజమని, దీన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు. శనివారం ఆయన బీజేపీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీకి 19 శాతం ఓటు బ్యాంక్ ఉందని, ప్రజలు ఇష్టంతో బీజేపీలో చేరుతున్నారన్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం మంత్రులకు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టి సభ్యత్వ నమోదు చేయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు ఎర చూపి సభ్వత్వాలు అంటకడుతున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ సభ్యత్వాలను అధిగమించలేదన్నారు. కాంగ్రెస్ మరుగుజ్జు పార్టీ అని, ఆ పార్టీకి అధ్యక్షుడే లేరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ వాళ్లు కాలర్ ఎగరేస్తారని కేటీఆర్ అనడాన్ని ఇంద్రసేనారెడ్డి ఖండించారు. బీజేపీని చూసి ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయన్నారు.
కుంతియా టికెట్లు అమ్ముకున్నరు
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న కుంతియా.. బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శించడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.