ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మారుతోన్న పరిణామాలకు అనుగుణంగా పావులు కదుపుతోన్న కమలదళం ఎన్డీయేకు దూరమైన పాత మిత్రులను కలుపుకుని వెళ్లాలని చూస్తోంది. ఈనెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి హాజరు కావాలని జనసేనకు ఆహ్వానం లభించింది. ఆ క్రమంలో అన్నాడీఎంకే, తమిళ్ మనీలా కాంగ్రెస్, పీఎంకే, లోక్ జనశక్తి, హిందుస్తానీ ఆవామ్ మోర్చాకు ఆహ్వానాలు పంపారు. శిరోమణి ఆకాలీ దళ్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలకు ఆహ్వానాలు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనసేన మాత్రమే ఆహ్వానం అందింది. ఏపీ వరకు మాత్రమే బీజేపీ, జనసేన పొత్తును పరిమితం చేసింది. తెలంగాణలో పొత్తు లేదనేసంకేతాలు ఇస్తోంది. ఇదే ఈక్వేషన్ ను టీడీపీ విషయంలోనూ పాటిస్తుందా? లేదా దూరంగా టీడీపీని పెడుతుందా? అనేది పెద్ద చర్చ. ఈనెల 18వ తేదీన జరిగే ఎన్డీయే మీటింగ్ తో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య నడుస్తోన్న గేమ్ కు ఫుల్ స్టాప్ పడనుంది.
మూడే మూడు రోజుల్లో బీజేపీ, టీడీపీ మధ్య దోబూచులాటకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరు కావాలని జనసేనకు ఆహ్వానం లభించింది. కానీ, టీడీపీకి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్విటేషన్ లేదు. సరిగ్గా ఇక్కడే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది తేలనుంది. ఒక వేళ ఎన్డీయే పక్షాల సమావేశానికి టీడీపీ హాజరు కాకుండా ఉంటే, పొత్తు లేనట్టు భావించడానికి అవకాశం ఉంది. జనసేనాని పవన్ మాత్రం బీజేపీని కలుపుకుని టీడీపీతో కలిసి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఆ విషయాన్ని పరోక్షంగా ఇప్పటికే పలుమార్లు ఆయన చెప్పారు. మరి ఈ సమావేశంలో కమలనాథులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.