- దేశంలో మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే కుట్రకు తెరలేపింది
- సవాళ్లు, ప్రతి సవాళ్లలో మా మంత్రులదే పైచేయి
- న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ కాంక్లేవ్
హైదరాబాద్, వెలుగు: ‘సర్’ అంటే ఓట్లు జతచేసే కార్యక్రమంలా కాకుండా.. ఓట్లను తొలగించే కార్యక్రమంలా మారిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ అని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చి.. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తెరలేపిందని ఆరోపించారు. గాంధీ, నెహ్రూ వారసత్వాన్ని మరిపించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రపంచంలోనే నెహ్రూ విజనరీ ఉన్న లీడర్ అని ప్రశంసించారు.
గాంధీ కుటుంబం త్యాగాలకు మారుపేరని పేర్కొన్నారు. శనివారం ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన నేషనల్ లీగల్ కాంక్లేవ్లో మహేహ్గౌడ్ చీఫ్ గెస్టుగా హాజరై, మాట్లాడారు. రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకొని బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని, అసలు బీజేపీలో రాముడికి సభ్యత్వం ఉందా? అని ప్రశ్నించారు. 12 ఏండ్లలో చేసిన అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని సవాల్ విసిరారు.
ఇప్పటికైనా ప్రధాని మోదీ భ్రమలు వీడాలని, గొప్ప, గొప్ప మహారాజులే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. దేశంలో అధికారమే పరమావధిగా మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీనాక్షీ నటరాజన్లాంటి నాయకురాలి రాజ్యసభ సీటును బీజేపీ చోరీ చేసిందని, పశ్చిమ బెంగాల్, బిహార్లో ‘సర్’ పేరుతో ఓట్ల చోరీ ఎలా జరిగిందో చూశామని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో కుల సర్వే నిర్వహించి దేశానికి రోల్ మోడల్గా నిలిచామన్నారు. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ మిషన్లో చేరి దేశంలోని అప్రజాస్వామిక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. పేపర్ లీకులతో దేశంలోని విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కారు చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు.
న్యాయవాద వృత్తి చాలా గొప్పది: మంత్రి వివేక్
సమాజంలో వ్యాపారం, రాజకీయాలు, మీడియాలాంటి రంగాల్లో సంస్కరణలు వస్తున్నట్టే..న్యాయ వ్యవస్థలో కూడా రావాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సమాజంలో న్యాయవాది వృత్తి చాలా గౌరవప్రదమైందని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో దేశానికి చెందిన ఎందరో లాయర్లు క్రియాశీలకంగా పాల్గొని పోరాడారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడిన రోజుల్లో చదువుకున్న లాయర్లే కోర్టుల్లో కేసులను వాదించి గెలిచారని, యూత్ కాంగ్రెస్లో ఎంతో మంది యువతీ, యువకులు న్యాయవాద వృత్తిని ఎంచుకున్న వారు ఉన్నారని తెలిపారు.
ఈ వృత్తిలో ఉన్నవారికి లీగల్ పాయింట్స్ నేర్చుకోవడానికి, కోర్టు కేసులను అర్థం చేసుకోవడానికి ఇలాంటి కాంక్లేవ్లు మంచి అవకాశం అని పేర్కొన్నారు. లాయర్లు ఒక కేసులో అనుకూలంగా, మరో కేసులో వ్యతిరేకంగా వాదించాల్సి ఉంటుందని, అందువల్ల వారికి ఏ సమస్యపై అయినా సరే ఒక సమగ్రమైన దృక్పథం ఉండాలని సూచించారు. కేసు స్టడీలను బాగా అధ్యయనం చేసినప్పుడే పునాది బలంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు బలంగా మారుతుంటాయని చెప్పారు.
అందుకే ప్రభుత్వ, న్యాయ వ్యవస్థల మధ్య బ్యాలెన్స్ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ బాను చిబ్, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్రెడ్డితోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు సమకాలీన న్యాయ అంశాలపై విస్తృతంగా చర్చ సాగింది.
కేటీఆర్, హరీశ్ పారిపోయారు
రాష్ట్రంలోని అప్పులు, గురుకులాల టెండర్లపై తమ మంత్రులు, బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లలో పైచేయి సాధించింది తామేనని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ తెలిపారు. ఈ విషయంలో తమ మంత్రుల సవాళ్లకు సమాధానం చెప్పలేక కేటీఆర్, హరీశ్ పారిపోయారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. ఇప్పుడు ఎవరి స్థాయి ఏమిటి అనే దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని, ఎవరి స్థాయి ఏమిటి అనేది ఇప్పటికే ప్రజలు నిర్ణయించారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్.. ఇప్పటికైనా ఫామ్హౌస్ను వీడి బయటకు రావాలని కోరారు. ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.
