సర్కారులోని బడా లీడర్ నెట్ వర్క్ వల్లే ఇంటర్ సమస్య: లక్ష్మణ్

సర్కారులోని బడా లీడర్ నెట్ వర్క్ వల్లే ఇంటర్ సమస్య: లక్ష్మణ్

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి,అక్రమాలకు పాల్పడుతుందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్రంలో తిరిగి మోడీ ప్రభుత్వం రాగానే వాటిపై విచారణ చేయించి ఆ అక్రమ సొమ్మును తిరిగి రాబట్టడం ఖాయమని చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడి, ఆ సొమ్మును ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా ఖర్చు చేశారని విమర్శించారు.

ఇంటర్మీడియేట్ బోర్డు అంశంపై ప్రస్తావిస్తూ.. 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. ఫలితాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బడా నాయకుల సంబంధీకుల సంస్థ వల్లనే విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, దాని వల్ల తమకు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఆయన విమర్శించారు. దేశంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం రాబోతోందని. సంపూర్ణ మెజారిటీ తో కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని లక్ష్మణ్ తెలిపారు