వరంగల్ జిల్లాలో బడి కోసం.గుడిని కూల్చేస్తారా? : ఏలేటి ఉమా మహేశ్వర్ రెడ్డి

వరంగల్ జిల్లాలో బడి కోసం.గుడిని కూల్చేస్తారా? : ఏలేటి ఉమా మహేశ్వర్ రెడ్డి
  • కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలి
  •     అశోక్​నగర్​ శివాలయాన్ని పున:నిర్మించాలి
  •     బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి ఉమామహేశ్వర్​రెడ్డి

నర్సంపేట, వెలుగు  : వరంగల్​ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్​నగర్​లో బడి నిర్మించడం కోసం.. పురాతన శివాలయన్ని ధ్వంసం చేయడం ఏంటని   బీజేపీ ఫ్లోర్​ లీడర్​ ఏలేటి ఉమామహేశ్వర్​రెడ్డి మండిపడ్డారు.   శివాలయాన్ని శుక్రవారం  ఆయన పరిశీలించి, స్థానిక నాయకుల ధర్మాగ్రహ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం  మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..  కాకతీయులు నిర్మించిన శివాలయాన్ని కూల్చిన ఘటనపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. గుడులను కాపాడేందుకు బీజేపీ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. 8వందల సంవత్సరాల చరిత్ర గల అశోక్​నగర్​ శివాలయం ఎండో మెంట్​ పరిధిలో లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. పురాతన ఆలయాన్ని గుర్తించలేని స్థితిలో పురావస్తు శాఖ ఉందా అని ప్రశ్నించారు.

శివాలయానికి 15 ఎకరాలు కేటాయించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం గుడి నిర్మించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో చందాలు వేసుకుని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి మెప్పు కోసం కొంత మంది మంత్రులు శ్రీరాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాష్ర్టంలో ఓ వైపు హిందువులపై దాడులు చేస్తూనే.. మరో వైపు 27 నెలల కాలంలో 13 గుళ్లను ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అశోక్​నగర్​ శివాలయం కూల్చిన చోటే  నిర్మించకపోతే..  తామే శంకుస్థాపన చేసి నిర్మిస్తామన్నారు.  కార్యక్రమంలో ఆపార్టీ వరంగల్​ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్​, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్​రెడ్డి, నాయకుల గూడూరు సందీప్​, మనీష్​ పాల్గొన్నారు.