తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు క్వాలిటీ లేవని, తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో పేదలకు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ నిలబెట్టుకోలేక పోయిందన్నారు. 2019 డిసెంబర్ కే 2లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి టీఆరెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఎక్కడెక్కడ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించిన డీకే అరుణ.. GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ -కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని, బీజేపీ ని ఎదురుకోలేక కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసి తిరుగుతున్నాయని అన్నారు.
GHMC ఎన్నికల్లో బీజేపీ ముందు ఉందని.. టీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోతుందనే సమాచారం సీఎం కు వచ్చిందన్నారు అరుణ. GHMC ఎన్నికల్లో టీఆరెస్-కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, ఎన్నికల ముందు మళ్ళీ టీఆరెస్-కాంగ్రెస్ తిరగడం దేనికి సంకేతమని అన్నారు. రెండు రోజులు GHMC లో పర్యటన చేసిన భట్టి విక్రమార్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల క్వాలిటీ గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
మంత్రి తలసానికి ప్రధాని మంత్రిని విమర్శించే స్థాయి లేదని ఆమె అన్నారు. GHMC లో టీఆర్ఎస్ కి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని.. సీఎం అనుమతి లేకుండా తలసాని భట్టి ఇంటికి వెళ్లగలరా? అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది అనే నెపంతో ప్రభుత్వం హై డ్రామా చేస్తుందన్నారు. బీజేపీ బలపడుతుందనే నెపంతో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ పెంచిపోషిస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదురుకోలేక–కాంగ్రెస్ టీఆరెస్ కలిసి పోటీచేసేటట్లు ఉన్నాయని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కాంగ్రెస్-టీఆర్ఎస్ డ్రామాను ఎండ కడుతామని చెప్పారు.