కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పైసలిచ్చి సహకరిస్తుండంట: ఈటల రాజేందర్

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పైసలిచ్చి సహకరిస్తుండంట: ఈటల రాజేందర్

కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను నిప్పు కణికలు అంటే నవ్వొస్తుందన్నారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే స్పీకర్పై అవిశ్వాసం పెట్టినమని గుర్తు చేశారు. 2014లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్నారని..వారికి డబ్బులిచ్చే కేసీఆర్ చేర్చుకున్నారా అని ప్రశ్నించారు.  2018లో 90 సీట్లలో గెలిచినా కూడా..ప్రతిపక్షాలు ఉండొద్దని ..ప్రజల పక్షాన మాట్లాడొద్దు అని..కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోలేదా ప్రశ్నించారు. 2014తో పాటు..2018లో విపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా అన్నారు. 


కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే..
కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా కనుమరుగు అవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను లేపాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్కు డబ్బులిచ్చి కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ అహంకారాన్ని, కుటుంబ పాలనను, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానాన్ని  చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డిని, ప్రభాకర్ రెడ్డిని ఓటర్లు గమనించాలని కోరారు. నల్గొండ జిల్లా ఉద్యమాల గడ్డ అని చెప్పారు. చైతన్యానికి కొదవ లేని ప్రాంతం మునుగోడు ప్రాంతమన్నారు. మునుగోడు ప్రజలు, రైతులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు.