కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ వెసుకోకపోవడం అంటే వ్యాక్సినేషన్ను అవమానించటమేనని ఆయన అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు.
‘కరోనా మరణాలను, కేసులను తెలంగాణ ప్రభుత్వం దాచిపెడ్తోంది. ఈ చేతకాని కేసీఆర్ ప్రభుత్వం.. నెపాన్ని కేంద్రంపై వేయటాన్ని ఖండిస్తున్నాం. కరోనా సోకిన కేసీఆర్, కేటీఆర్లు ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయటం సరైంది కాదు. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పటం నిజం కాదా? హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం తీరు మారకపోవటం బాధాకరం. వ్యాక్సినేషన్పై మంత్రి ఈటల వ్యాఖ్యలు అవాస్తవాలు. కేంద్రం పంపిన వ్యాక్సినేషన్ను అత్యంత ఎక్కువగా వృధా చేసిన రాష్ట్రం తెలంగాణ. ఆస్పత్రి నిర్మాణానికి డీఆర్డీవో ముందుకు వచ్చినా ప్రభుత్వం స్పందించికపోవటం చేతగానితనమే’ అని ఆయన అన్నారు.