కేసీఆర్ సర్కారు తెలంగాణను లూటీ చేస్తోంది: తరుణ్ చుగ్

కేసీఆర్ సర్కారు తెలంగాణను లూటీ చేస్తోంది: తరుణ్ చుగ్

స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నిధులిస్తుంటే.. కేసీఆర్ సర్కారు ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. మార్చి12న వరంగల్ జిల్లాలో ఆయన పర్యటించారు. ముందుగా పోచమ్మ మైదాన్ లోని రాణిరుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. లిక్కర్ స్కాంలో విచారణ కోసం పిలిస్తే ఆ విచారణ సంస్థలపై సీఎం కేసీఆర్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుదోవ పట్టించడంలో కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవొచ్చని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్.
 
వరంగల్ లో రాణిరుద్రమాదేవి ఆశీస్సులు తీసుకోవటం సంతోషంగా ఉందన్న తరుణ్ చుగ్..కేసీఆర్ సర్కారు తెలంగాణను లూటీ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కాదు..అలీబాబా నలభై దొంగల సర్కార్ అని తరుణ్ చుగ్ మండిపడ్డారు. దోచేయ్..దాచెయ్ అన్నట్లుగా కేసీఆర్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో తోలుబొమ్మలా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బై బై చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ప్రజలు బీజేపీని ఆశీర్వదించబోతున్నారని జోస్యం చెప్పారు.