
దశాబ్దాలుగా వివక్ష, పీడనకు గురైన తెలంగాణలో.. ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా రూపుదిద్దుకుంది. 1996 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ సారథ్యంలో సాగిన మలిదశ ఉద్యమంలో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, సంఘాలు ఎవరికి వారు మరో ఉద్యమానికి సన్నద్ధం అయినారు. ప్రొఫెసర్కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, వి.ప్రకాశ్, పాశం యాదగిరితో జత కట్టి ఆనాడు తెలంగాణ ఉద్యోగుల సంఘం స్థాపించి ఉద్యోగ వర్గాలను ఏకం చేసే ప్రయత్నం చేశాం. 610 జీవో పునాదుల మీద 2001 లో తెలంగాణ ఉద్యోగుల సంఘం నా అధ్యక్షతన ఏర్పాటు అయింది. ఇంకో వైపు కేసీఆర్ టీడీపీ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి టీఆర్ఎస్ స్థాపించారు. జయశంకర్ సార్ చొరవతో విద్యావంతుల వేదిక, జర్నలిస్ట్ ల ఫోరం, రచయితల వేదికలు, కవులు కళాకారుల సంఘాలు 2002 వరకు ఏర్పాటయ్యాయి. తెలంగాణ ఆకాంక్షకు అనేక పార్శ్వాలున్నా దానిని సంక్షిప్తం చేసి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఇచ్చాం. ఇవన్ని కలిసి 2009 వరకు తెలంగాణ నినాదాన్ని గడప గడపకు తీసుకెళ్లాయి.
టీఆర్ఎస్ చారిత్రక తప్పు
2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేసి విజయం సాధించి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్నాయి. దీంతో అనేక తెలంగాణ సమస్యలపై టీఆర్ఎస్ మౌనం వహించింది. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఇతర సంఘాలతో కలిసి ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసి అనేక పోరాటాలు చేశాం. 610 జీవో, గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ అమలు కోసం ఉద్యమించాం. ఈ పోరాటాలే టీఆర్ఎస్ అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడానికి కారణం. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి.. ఆంధ్ర పాలకుల కుట్రల ద్వారా ఉద్యమం మరుగున పడే సందర్భంలో ఈ సంఘాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచినాయి. 2009 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ చారిత్రక తప్పు చేసింది. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తు పెట్టుకొని కేవలం తొమ్మిది సీట్లు గెల్చి ఉద్యమాన్ని నీరుగార్చింది. ఆ సందర్భంలో కూడా ఉద్యమ చైతన్యం చల్లారకుండా ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినం. 2009 అక్టోబర్ లో ఉద్యోగ నియామకాలలో హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా పరిగణించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆందోళనలు చేశాం.
బలిదానాలతో ఫలించిన తెలంగాణ..
ఈ తీర్పు రద్దు చేయకుంటే రాష్ట్రం అగ్ని గుండం చేస్తామని ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ స్టేట్ మెంట్ ఎందుకు ఇచ్చావు అని ఈటలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ, మా సంఘాలతో చర్చల తర్వాత హైదరాబాద్ ఫ్రీ జోన్ పై సుప్రీం కోర్టు తీర్పు రద్దు కోరుతూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నడు. మా ఆధ్వర్యంలో జరిగిన సిద్దిపేట ఉద్యోగ గర్జనలో ఆమరణ దీక్ష ప్రకటించాడు. ఆ దీక్షకు మద్దతుగా ఉద్యోగుల జేఏసీ పెన్ డౌన్ స్ట్రైక్ కు పిలుపు నిచ్చాం. 2009 నవంబర్ 29న దీక్ష ప్రారంభమైన నుంచి డిసెంబర్ 9 వరకు టీఆర్ఎస్ తో పాటు అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. డిసెంబర్ 24న కోదండరాం సారథ్యంలో అన్ని పార్టీలు, సంఘాలతో తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. 2009 నుంచి 2014 వరకు అనేక ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు. చివరకు తెలంగాణ కల సాకారమైంది.
తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్లయింది. ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నది. నిజానికి ఉత్సవాలకు ఇది సమయమా? ప్రజలు ఈ పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? స్వరాష్ట్ర సాధనలో ఎవరి పాత్ర ఏంటి? రాష్ట్రం వచ్చాక ఎవరు బాగుపడ్డారు? ఎవరు భంగపడ్డారు? అనే విషయం తప్పకుండా ఈ ఉత్సవాల సందర్భంగా చర్చనీయాంశమే.
స్వరాష్ట్రంలో బాగుపడ్డదెవరు?
తెలంగాణ మళ్లీ దగా పడిందనేది నేడు ప్రజల భావన. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం తొమ్మిదేండ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పుల భారంతో సతమతమవుతోంది. రెండు లక్షల ఖాళీలు ఉన్నా.. ఉద్యోగాల రాక నిరుద్యోగులు ఆగమయ్యారు. ప్రభుత్వ భూములు అధికార పార్టీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయి. కేసీఆర్ పాలనలో ఎవరు ఎలా నష్టపోయారంటే..
ఉద్యమకారులు: ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర అమోఘం. రాష్ట్ర సాధన కోసం ఇల్లు, సంసారం వదిలి తిరిగారు. ఆర్థికంగా చితికిపోయారు. రాష్ట్రం ఏర్పడిన మరుక్షణం నుంచి అవమానాలకు గురయ్యారు. కానీ తెలంగాణ వ్యతిరేకులు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. స్వయంగా కేసీఆరే ఉద్యమ వ్యతిరేకులను చేరదీసి.. ఉద్యమకారులను పార్టీ నుంచి సాగనంపాడు.
నిరుద్యోగులు: స్వరాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయని లక్షలాది విద్యార్థులు పోరాటం చేశారు. వందలాది మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడే లక్ష పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2020 నాటికి అవి రెండు లక్షలకు చేరినయి. ఇన్నేండ్లలో ఏ ఒక్క రోజు ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ చిత్తశుద్ధి చూపించలేదు.
రైతులకు మొండిచేయి: ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని రకాల సబ్సిడీలు ఎత్తేశారు. ఎరువులు, డ్రిప్, విత్తనాల సబ్సిడీ లాంటివి ఏవీ ఇవ్వట్లేదు. రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే 4వ ర్యాంక్లో ఉంది.
దళితబంధుతో దగా: దళితులను ఉద్ధరించడానికి దళిత బంధు అమలు చేస్తామన్నారు. కానీ ఈ పథకం ఎన్నికల స్టంట్ మాత్రమే.
బీసీలకు అన్యాయం: బీసీలను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు. కులాల వారీగా విభజించి గొర్రెలు, బర్రెలు, చేపలు అంటూ రాజకీయ ఎదుగుదలను ప్రోత్సహించడం లేదు.
మహిళల బతుకుల్లో వెలుగులేవి: మహిళల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం దార్శనిక ప్రణాళిక రూపొందించలేకపోయింది. గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాలు నిధులు లేక కనుమరుగవుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి.
సి.విఠల్,
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమకారుడు