- కోర్టు మొట్టికాయలేసినా సీఎం తీరు మారట్లే
- అంతిమ విజయం కార్మికులదే
- మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి
బెల్లంపల్లి/ మంచిర్యాల కోల్బెల్ట్, వెలుగు: పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ఆగం చేస్తున్నాడని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని, ఆయన కుటుంబాన్నే బంగారుమయం చేసుకుంటున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ‘గాంధీ సంకల్పయాత్ర’లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కళావేదికలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన జనంపైనే సీఎం తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, ఆర్టీసీ విషయంలో బాధ్యత లేకుండా పంతానికి పోతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు మొట్టికాయలు వేస్తున్నా సీఎం ఆలోచన తీరులో మార్పు రావడం లేదన్నారు. ఉద్యమ కాలంలో ఆర్టీసీ కార్మికులు గొప్పగా పోరాడారని
మెచ్చుకున్న సీఎం ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలే తీసేసే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. సమ్మెకు ప్రజల మద్దతు పెరుగుతోందని, సర్కారు దిగిరాక తప్పదన్నారు. ఎన్ని రోజులు సమ్మెలో ఉన్నా జీతాలు ఎక్కడికీ పోవని, అంతిమ విజయం కార్మికులదేనన్నారు. సీఎం కేసీఆర్ మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కమీషన్ల కోసమే కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ అంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేసి రూ.60 వేల కోట్ల విలువైన భూముల్ని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్అంచనా వ్యయాన్ని రూ.30 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచి కేసీఆర్ కమీషన్లు దండుకున్నారని వివేక్ ఆరోపించారు. ప్రజలు సామాజిక తెలంగాణ కోరుకుంటే, కేసీఆర్ కల్వకుంట్ల తెలంగాణ చేశారని ఎద్దేవా చేశారు.
మున్సిపోల్స్లో గెలిపిస్తే దండిగా నిధులు
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీనిమెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా తెచ్చేందుకు కృషి చేస్తామని వివేక్ హామీ ఇచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. యాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముల్కల మాల్లారెడ్డి, ఇన్చార్జి రాజమౌళి గౌడ్, మంచిర్యాల, చెన్నూరు నియోజకర్గాల ఇన్చార్జులు రఘునాథ్ వెరబెల్లి, అందుగుల శ్రీనివాస్, బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మునిమంద స్వరూప రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మందమర్రిలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన వివేక్ వెంకటస్వామి.. 66 మంది కార్మికులకు 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.