హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీకి రూ.35 వేల కోట్లు అవసరమని అయితే బుడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది రూ.19వేల కోట్లు మాత్రమే అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్కు రూ.80 వేల కోట్లు కావాలని.. వీటన్నింటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు.
మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ బూటకపు మాటలతో రైతులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని అన్నారు. జీవో నంబర్ 37 మీద తాను చేసిన ఆరోపణలపై ప్రభుత్వంలోని ఎవరు మాట్లాడటం లేదన్నారు. దీన్ని బట్టి అందులో అవినీతి జరిగిందని అర్థం అవుతుందన్నారు. జీవో 37 రద్దు చేసే వరకు ఫైట్ చేస్తామన్నారు.