
హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కు మాత్రమే సీఎం కాదని, రాష్ట్రం మొత్తానికి సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. కేవలం కొడంగల్, వికారాబాద్, నారాయణపేట్ అభివృద్ధికి మాత్రమే సీఎం పరిమితమయ్యారని విమర్శించారు. శనివారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఆదివాసీల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఊరూరా నిర్వహించిందని.. కానీ, వారి వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ఆదివాసీల గ్రామాలకు నేటికీ రహదారులు లేవని, గిరిజనుల బతుకులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పారు. గ్రామాలకు రోడ్లు లేక అనారోగ్యంతో గిరిజనలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.