కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల!..ఇటు బీఆర్​ఎస్​లో.. అటు బీజేపీలో తీవ్ర దుమారం

కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల!..ఇటు బీఆర్​ఎస్​లో.. అటు బీజేపీలో తీవ్ర దుమారం
  • బీజేపీలో బీఆర్​ఎస్​ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత
  • ఆ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​
  • తమ వాళ్లూ అమ్ముడుపోతారంటూ కామెంట్స్​
  • తలలు పట్టుకుంటున్న రెండు పార్టీల నేతలు  
  • కేడర్​కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్​ పెద్దలపై కవిత చేసిన సంచలన కామెంట్స్​ఆ పార్టీతో పాటు బీజేపీలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె కొట్టిన దెబ్బకు రెండు పార్టీలు విలవిల్లాడుతున్నాయి. ‘‘బీజేపీలో బీఆర్​ఎస్​ విలీనానికి కుట్రలు జరిగాయి” అని కవిత వ్యాఖ్యలు చేయగా.. అందుకు బలాన్ని చేకూరుస్తూ బీజేపీ  ఎమ్మెల్యే రాజాసింగ్​కూడా ‘‘కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజీ ఇస్తే మావాళ్లు కూడా బీఆర్​ఎస్​తో కలిసిపోతరు’’ అని చెప్పడం రెండు పార్టీల్లో కలకలానికి దారితీసింది. 

జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక బీఆర్​ఎస్​ నేతలు తలలు పట్టుకుంటుంటే.. బీజేపీలోని లుకలుకలూ బయటపడడంతో కమలం నేతలూ ఆలోచనలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి పనిచేశాయని మొదటి నుంచి కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇలాంటి టైమ్​లో బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ కూతురు కవిత తాజా కామెంట్లు, వాటికి తోడు రాజాసింగ్​ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో హీట్​ పుట్టిస్తున్నాయి.  

ఆరోపణలకు బలం చేకూర్చేలా..!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ హైకమాండ్ ఉన్నట్టుండి మార్చేసింది. బండి సంజయ్​ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ పార్టీలో ఉన్న జోష్​ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వస్తాయనే అంచనాలు ఉండేవి.  కానీ, అకస్మాత్తుగా అధ్యక్షుడ్ని మార్చేయడంతో రాష్ట్ర బీజేపీ కేడర్​ నిరుత్సాహానికి గురైందనే వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్​తో కుదిరిన అవగాహన ఒప్పందం వల్లే అధ్యక్షుడ్ని మార్చారని, దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్​ డిజిట్​ సీట్లు గెలవాల్సిన బీజేపీ కేవలం సింగిల్​ డిజిట్​కే పరిమితమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

 ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపినా.. ఇంటర్నల్​గా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందనే విమర్శలు వినిపించాయి. ఎంపీ​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇటీవల జరిగిన టీచర్స్​, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పోటీ చేయలేదు. బీజేపీకి సహకరించేందుకే బీఆర్​ఎస్​ పోటీ చేయాలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ప్రస్తుతం కవిత, రాజాసింగ్​ వ్యాఖ్యలున్నాయి. బీఆర్ఎస్​, బీజేపీ ఒక్కటేనని ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే ఆ రెండు పార్టీలు ఖండిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రెండు పార్టీల్లోని కీలక నేతలు చేసిన కామెంట్లపై క్షేత్ర స్థాయిలో కేడర్​కు ఎలాంటి సమాధానం చెప్తారని ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.  

కాంగ్రెస్​ చేతికి అస్త్రం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ వ్యాఖ్యలు కాంగ్రెస్​ చేతికి పదునైన రాజకీయ ఆయుధాన్ని ఇచ్చినట్టయింది. సందర్భం వచ్చినప్పుడల్లా.. బీజేపీ, బీఆర్ఎస్​ దోస్తులంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల్లోని కీలక నేతలు.. తమ పార్టీల లోగుట్టు బయటపెట్టడంతో కాంగ్రెస్​ నేతల వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్టయింది. దీంతో ఆ పార్టీలపై విమర్శమొదలు పెట్టారు. 

హరీశ్​, కేటీఆర్​ సైలెంట్​ 

కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు లోలోపల చర్చించుకుంటున్నా బయటకు మాత్రం స్పందించడం లేదు. కేటీఆర్​, హరీశ్​ రావుపై పరోక్ష వ్యాఖ్యలు చేసినా.. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కవిత వ్యాఖ్యలపై హరీశ్​ రావు సైలెంట్​గా ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్​ విదేశీ పర్యటనలో ఉండడంతో.. ఆయన నుంచీ ఎలాంటి ప్రకటనా రాలేదు.