
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత
- ఆ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- తమ వాళ్లూ అమ్ముడుపోతారంటూ కామెంట్స్
- తలలు పట్టుకుంటున్న రెండు పార్టీల నేతలు
- కేడర్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పెద్దలపై కవిత చేసిన సంచలన కామెంట్స్ఆ పార్టీతో పాటు బీజేపీలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె కొట్టిన దెబ్బకు రెండు పార్టీలు విలవిల్లాడుతున్నాయి. ‘‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయి” అని కవిత వ్యాఖ్యలు చేయగా.. అందుకు బలాన్ని చేకూరుస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కూడా ‘‘కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజీ ఇస్తే మావాళ్లు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతరు’’ అని చెప్పడం రెండు పార్టీల్లో కలకలానికి దారితీసింది.
జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటుంటే.. బీజేపీలోని లుకలుకలూ బయటపడడంతో కమలం నేతలూ ఆలోచనలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇలాంటి టైమ్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు కవిత తాజా కామెంట్లు, వాటికి తోడు రాజాసింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
ఆరోపణలకు బలం చేకూర్చేలా..!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ హైకమాండ్ ఉన్నట్టుండి మార్చేసింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ పార్టీలో ఉన్న జోష్ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వస్తాయనే అంచనాలు ఉండేవి. కానీ, అకస్మాత్తుగా అధ్యక్షుడ్ని మార్చేయడంతో రాష్ట్ర బీజేపీ కేడర్ నిరుత్సాహానికి గురైందనే వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్తో కుదిరిన అవగాహన ఒప్పందం వల్లే అధ్యక్షుడ్ని మార్చారని, దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు గెలవాల్సిన బీజేపీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపినా.. ఇంటర్నల్గా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందనే విమర్శలు వినిపించాయి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇటీవల జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. బీజేపీకి సహకరించేందుకే బీఆర్ఎస్ పోటీ చేయాలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ప్రస్తుతం కవిత, రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే ఆ రెండు పార్టీలు ఖండిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రెండు పార్టీల్లోని కీలక నేతలు చేసిన కామెంట్లపై క్షేత్ర స్థాయిలో కేడర్కు ఎలాంటి సమాధానం చెప్తారని ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ చేతికి అస్త్రం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ చేతికి పదునైన రాజకీయ ఆయుధాన్ని ఇచ్చినట్టయింది. సందర్భం వచ్చినప్పుడల్లా.. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తులంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల్లోని కీలక నేతలు.. తమ పార్టీల లోగుట్టు బయటపెట్టడంతో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్టయింది. దీంతో ఆ పార్టీలపై విమర్శమొదలు పెట్టారు.
హరీశ్, కేటీఆర్ సైలెంట్
కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు లోలోపల చర్చించుకుంటున్నా బయటకు మాత్రం స్పందించడం లేదు. కేటీఆర్, హరీశ్ రావుపై పరోక్ష వ్యాఖ్యలు చేసినా.. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కవిత వ్యాఖ్యలపై హరీశ్ రావు సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండడంతో.. ఆయన నుంచీ ఎలాంటి ప్రకటనా రాలేదు.