
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో తప్పులు జరగకపోతే కమిషన్ ముందు హాజరై వివరాలు చెప్పడానికి కేసీఆర్కు భయం ఎందుకని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ ఎంక్వయిరీ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాకుండా, కమిషన్కు విచారణ జరిపే అర్హతే లేదంటూ విమర్శించడాన్ని ఓ ప్రకటనలో ఆయన తప్పుపట్టారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల ఏర్పాటు అంశాలపై కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు కేసీఆర్ హాజరై వివరణ ఇచ్చి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేదన్నారు. వివరణ ఇవ్వకుండా విచారణ కమిషన్నే విమర్శిస్తూ లేఖ రాయడం విచారణ వ్యవస్థలను అగౌరవపరచడమేనని ఆయన విమర్శించారు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తీరు అప్రజాస్వామికమని పేర్కొన్నారు.