వరంగల్, వెలుగు:సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయని, తొందర్లోనే వీరి అక్రమాలు బహిర్గతం చేస్తామని చెప్పారు. 2023 తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని కలవాలంటే చంచల్ గూడ జైలుకే వెళ్లాల్సి ఉంటుందన్నారు. హన్మకొండలోని బీజేపీ ఆఫీస్లో నిర్వహించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ సమావేశంలో ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి అర్వింద్ మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం ఫామ్హౌస్లో గడుపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘తనను తాను మహాత్మగాంధీతో పోల్చుకున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రానికి మహ్మద్ అలీ జిన్నాలా తయారైండు. హిందూ ధర్మానికి మొట్టమొదటి వ్యతిరేకి కేసీఆర్, ఆయన కుటుంబం, ఆ తర్వాతే ఒవైసీ” అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు ఒవైసీ పెద్దకొడుకు అని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానని హామీలిచ్చి గద్దెనెక్కారని, ఇప్పుడు హామీలు మరిచి ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని అర్వింద్ ఆరోపించారు.
కేంద్రం 4,849 కోట్లు ఇస్తే.. రాష్ట్రం ఏం చేసింది?
కరోనా కష్టకాలంలో కేంద్రం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే ఆ ఫలాలు అందకుండా సీఎం ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ధర్మపురి అర్వింద్ అన్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్రం రూ. 224 కోట్లు ఇచ్చిందని, వాటిని ఎలా వినియోగించుకున్నారో మాత్రం చెప్పడం లేదని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో హాస్పిటళ్లలో మౌలిక వసతులు, వెంటిలేటర్స్, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ కిట్లు ఇలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి మొదటి విడతగా రూ. 215 కోట్లు ఇచ్చిందన్నారు. గడిచిన రెండున్నర నెలల కాలంలో కేంద్రం నుంచి రూ. 4,849 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని, ఇలా వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుంటే వాటిని ఎలా వినియోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఆర్థికసాయంతో పాటు 7.14 లక్షల ఎన్ 95 మాస్కులు, 2.41లక్షల పీపీఈ కిట్లు, 23 లక్షల హైడ్రో క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు, 1,220 వెంటిలేటర్లు కూడా రాష్ట్రానికి కేటాయించిందని వివరించారు.
కవిత ఆదర్శంగా దాస్యం వినయ్, నరేందర్ కబ్జాలు
మాజీ ఎంపీ కవిత ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తారని, నిజామాబాద్ మహిళా కాలేజ్భూమిని ఆక్రమించారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బిల్లా, రంగాగా వ్యవహరిస్తూ వరంగల్లో గజం ఖాళీ జాగా కనిపించినా కబ్జా చేసేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. వరంగల్కు స్మార్ట్ సిటీ కింద విడుదలైన రూ. 200 కోట్లు ఏమయ్యాయో చెప్పాలని, దీని మీద కంప్లీట్ డీటైల్స్ ఇవ్వాలని కలెక్టర్ను ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్లో ‘అమృత్’ స్కీం కింద వచ్చిన దాంట్లో 90 శాతం నిధులు మిషన్ భగీరథకు కన్వర్ట్ చేశారని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వరంగల్ను హెరిటేజ్ సిటీగా డెవలప్ చేయడానికి హృదయ్ కింద రూ. 40 కోట్లు విడుదల చేస్తే ఆ పనులకు కేంద్ర మంత్రిని పిలువకుండా కేటీఆర్ మాత్రమే ప్రారంభోత్సవాలకు రావాలనుకోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీస్కు వెళ్లి ఎంజీఎంలో నెలకొన్న సమస్యలు, స్మార్ట్సిటీ ఫండ్స్ తదితర విషయాల గురించి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో చర్చించి వినతిపత్రం అందించారు.
ఇట్లయితే మామూలు జనానికి రక్షణేది: వివేక్
ప్రజలు ఎన్నుకున్న ఎంపీపైనే దౌర్జన్యానికి దిగితే, ఇక మామూలు పౌరులకు రక్షణ ఏముంటుందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నారని, ఇప్పుడు డైరెక్ట్గా భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు. ఎంపీ అర్వింద్పై దాడి పిరికిపందల చర్య అని ఆయన మండిపడ్డారు.
