ఫతేనగర్: టీఆర్ఎస్ గల్లీ పార్టీ, గడీల పార్టీ అని బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేనగర్లో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫతేనగర్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కృష్ణ గౌడ్ను గెలిపించాలని కోరారు. బీజేపీని ఢిల్లీ పార్టీ అని టీఆర్ఎస్ నేతలు అనడంపై సంజయ్ ఫైర్ అయ్యారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీదే హవా అన్నారు. దేశంలో 15కు పైగా రాష్ట్రాల్లో బీజేపీ పవర్లో ఉందన్నారు.
‘తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చిందే. రోడ్లు, లైట్లు, మోరీలు, చెట్లు, నీళ్లు, బియ్యం, కమ్యూనిటీ హాళ్లతో పాటు ఆఖరికి శ్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇచ్చిందే. మోడీ సర్కార్ ఇచ్చిన డబ్బులను సీఎం కేసీఆర్ ఫొటోలు, పేర్లు మార్చి, యాసతో, భాషతో అడ్డదారులతో తనవిగా చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతల గడీలను బద్దలుకొట్టే పార్టీ బీజేపీయే. దుబ్బాకలో ప్రజలు ఇచ్చిన తీర్పును హైదరాబాద్ జనాలు రిపీట్ చేయాలి. ఈ రాష్ట్రానికి బీజేపీ సర్కార్ రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చింది. రూ.3,500 కోట్లు ఇచ్చింది. భాగ్యనగరానికి 1.40 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చింది. కానీ కేసీఆర్ కట్టించలేదు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.