కేసీఆర్ అవినీతిలో ఒవైసీకి కూడా కమీషన్

కేసీఆర్ అవినీతిలో ఒవైసీకి కూడా కమీషన్

రామచంద్రాపురం: సీఎం కేసీఆర్ అవినీతితో లక్ష కోట్లు వెనకేసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీజేపీ వస్తే మత కలహాలు వస్తాయని కేటీఆర్ అంటున్నారని, మరి భైంసా బాధితులను ఆయన పలకరించారా అని ప్రశ్నించారు. రామచంద్రాపురంలో బీజేపీ నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటించారని.. ఆయన సూచనల మేరకే కేంద్రం రూ.440 కోట్లను హైదరాబాద్‌‌కు పంపిందన్నారు. అదే వరదల సమయంలో కేసీఆర్ హైదరాబాద్‌‌కు రాలేదన్నారు. కేంద్రం పంపిన డబ్బుల్లో రూ.250 కోట్లను కల్వకుంట్ల కుటుంబం కొట్టేసి.. మిగిలిన డబ్బులను టీఆర్ఎస్ కార్యకర్తలకు పంచిందన్నారు.

‘టీఆర్ఎస్ అవినీతి సొమ్మును జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పంచుతోంది. కేసీఆర్ నుంచి కార్పొరేటర్ దాకా ప్రజల డబ్బులను దోచుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపిస్తే వరద సాయం కింద రూ.25 వేలు ఇప్పిస్తాం. ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం మింగేస్తోంది. బందిపోట్ల కంటే కేసీఆరే ఎక్కువ సంపాదిస్తున్నారు. అదే మోడీ ఏడేళ్ల పాలనలో దేశంలో ఒక్క స్కామ్ కూడా జరగలేదు. ఆయనకు మనం మద్దతుగా నిలవాలి. కుల, మతాలకు అతీతంగా మోడీకి ఓటేయాలి. బీజేపీలో అవినీతికి ఆస్కారం లేదు. కేసీఆర్ అవినీతిలో ఒవైసీకీ కమీషన్ ఉంది’ అని అర్వింద్ పేర్కొన్నారు.