రేవంత్ డ్రాపౌట్ స్టూడెంట్..బీజేపీ నేర్పే పాఠాలు దేశం గర్వించేలా ఉంటాయి: ఎంపీ లక్ష్మణ్ 

రేవంత్ డ్రాపౌట్ స్టూడెంట్..బీజేపీ నేర్పే పాఠాలు దేశం గర్వించేలా ఉంటాయి: ఎంపీ లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి డ్రాపౌట్ స్టూడెంట్ అని, తమ స్కూళ్లోనే (బీజేపీ) కొనసాగితే విజన్ వేరేలా ఉండేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీజేపీలోనే తన స్కూల్ అంటూ చేసిన వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందించారు. తమ స్కూల్లో నేర్పిన పాఠాలు  దేశం గర్వించేలా ఉంటాయని తెలిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు అదేశించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఆర్థిక వేత్త కాదని, కానీ ప్రజల నాడి తెలిసిన వ్యక్తి అని చెప్పారు.

11 ఏండ్ల పాలనలో దేశాన్ని 4వ ఆర్థిక శక్తిగా ఎదిగేలా కృషి చేశారన్నారు. అవినీతికి తావులేకుండా మోడీ సర్కారు కేంద్రంలో పనిచేస్తోందని వివరించారు. కానీ, రేవంత్ సర్కార్ మాత్రం ప్రజల ఛీత్కారాలను ఎదుర్కొంటోందని లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్ తన కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడని, అటు ఢిల్లీ హైకమాండ్ తో ఇటు సహచర మంత్రులతో ఇబ్బందులు పడుతున్నాడన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం రేవంత్ ఇప్పటికే ఢిల్లీకి 45 సార్లు వెళ్లాడని, రాహుల్ కోరిక మేరకు ఆయన పనిచేస్తున్నారని మండిపడ్డారు.