
బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కారు ఒంటరిగానే పోరాడుతున్నది. బీజేపీ మాత్రం మారుమాటైనా మాట్లాడడం లేదు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలపై మౌనం వహిస్తున్నది. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ.. బనకచర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేయలేదు. పైగా సీఎం రేవంత్రెడ్డి కేంద్రంతో మాట్లాడాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఓ ప్రెస్మీట్లో అనడం గమనార్హం.
దీంతో బనకచర్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది..తమకేం పట్టింపు లేదు అనే రీతిలో బీజేపీ నేతల వ్యవహార శైలి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంపీల సమావేశానికి అసలు బీజేపీ ఎంపీలు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ వితండవాదం
మిగులు జలాలే లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) స్వయంగా కేంద్ర జలశక్తి శాఖకు సమాచారం ఇచ్చాయి. కానీ, ఇప్పటికీ ఏపీ మాత్రం బుకాయింపులకు దిగుతున్నది. తాము కేవలం మిగులు జలాల ఆధారంగానే ప్రాజెక్టును చేపడుతున్నామని అంటున్నది. గోదావరిలో కనీసం వంద రోజులు వరద ఉంటుందని, ఆ రోజుల్లోనే రోజూ 2 టీఎంసీల చొప్పున వరద జలాలను బనకచర్లకు తరలిస్తామని చెప్తున్నది.
తాజాగా ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచర్ల వల్ల ఎగువ రాష్ట్రాలకు అసలు ఎలాంటి సమస్యలు రావని, వారి నీళ్లను వాడుకోబోమని చెప్పారు. కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. తాము అన్ని నిబంధనలకు తగ్గట్టుగానే ప్రాజెక్టును చేపడుతున్నామని, అనుమతులు తీసుకున్నాకే ముందుకు వెళ్తామని చెప్పారు.
తెలంగాణలో కేసీఆర్ హయాంలో అనుమతులు రాకముందే కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు – రంగారెడ్డి, సమ్మక్కసాగర్ బ్యారేజీలను నిర్మించారని వ్యాఖ్యానించారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతానికి.. గోదావరిలో వృథాగా సముద్రంలో కలిసే నీటినే తీసుకెళ్తామంటే తెలంగాణ ఎందుకు అడ్డుకుంటున్నదంటూ ప్రశ్నించారు.