- అక్బరుద్దీన్ కు బండి సంజయ్ కౌంటర్
- ఎంఐఎంను చూస్తే కేసీఆర్ కు వణుకు పుడుతోందని ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్కంపేట్ రోడ్షోలో బుధవారం ఆయన మాట్లాడుతూ… ‘‘అక్బరుద్దీన్.. హైదరాబాద్ నీ అయ్య జాగిరా? నీ తాత జాగీరా.. నీకు పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్మున్నదా? నువ్వు కూల్చు చూద్దాం. నువ్వు కూల్చిన రెండు గంటల్లోనే నీ దారుస్సలాంను కూల్చేందుకు మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నరు’’ అంటూ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ రాసి ఇచ్చిన స్ర్కిప్ట్నే ఎంఐఎం చదువుతోందన్నారు. దారుస్సలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో రీసౌండ్ వస్తుందని విమర్శించారు. మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు చూస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘పాతబస్తీకి వచ్చే దమ్ముందా అని సీఎం కేసీఆర్కు ఎంఐఎం ఎమ్మెల్యే సవాల్ విసురుతుంటే, టీఆర్ఎస్ నాయకులు కనీసం ఆ సవాల్ను స్వీకరించడం లేదు. ఎంఐఎం పార్టీని చూస్తే కేసీఆర్కు వణుకుపడుతోంది. అందుకే ఎంఐఎం వాళ్లతో దోస్తానా చేస్తున్నడు” అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నాయకులు చేవచచ్చి ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఓ వర్గానికి కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే హైదరాబాద్లో బీజేపీగెలుస్తుందన్నారు.
పీవీ జ్ఞానభూమి, ఎన్టీఆర్ ఘాట్కు నేడు సంజయ్
హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న పీవీ జ్ఞానభూమి, ఎన్టీఆర్ ఘాట్ను సంజయ్ గురువారం సందర్శించనున్నారు. పీవీ జ్ఞానభూమి, ఎన్టీఆర్ ఘాట్కు రక్షణగా ఉంటామంటూ వాటి వద్దకే వెళ్లి ప్రామిస్ చేస్తానని బండి సంజయ్ చెప్పారు.
