ఎర్రబెల్లి..మా ఎమ్మెల్యేకు కంటి వెలుగు అద్దాలు ఇప్పించండి:రాకేష్ రెడ్డి

ఎర్రబెల్లి..మా ఎమ్మెల్యేకు కంటి వెలుగు అద్దాలు ఇప్పించండి:రాకేష్ రెడ్డి

మంత్రి దయాకర్ కి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి లేఖ రాశారు. తమ నగర ఎమ్మెల్యేలకు కంటివెలుగు కళ్లద్దాలు ఇప్పించండంటూ రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అందరూ కళ్లు సరిచూసుకొని, కళ్లద్దాలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్లను రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. పనిలో పనిగా మీలాంటి కళ్లద్దాలు తమ వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్ కి కూడా చెరో జత ఇప్పించండి మంత్రిగారు... అంటూ ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. వారికి వరంగల్ ప్రజలు పడుతున్న అవస్థలు ఏ మాత్రం కనిపించడం లేదని ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి ఆరోపించారు. పైగా వరంగల్ దశ దిశ మారిందని ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

ఎన్నో ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ లేక, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేక, డంపింగ్ యార్డ్ లేక మురికి వాడల్లో సౌకర్యాలు లేక, డబుల్ బెడ్ రూం ఇల్లు రాక, ఇళ్ళ పట్టాలు రాక, ఇంటి నుంబర్లు రాక, కొత్త రేషన్ కార్డ్ లు రాక, పెన్షన్లు రాక నగర ప్రజలు గోస పడుతున్నారని రాకేష్ రెడ్డి విన్నవించారు. విలీన గ్రామాల ప్రజలు పన్నులు పెరిగి గ్రామాల్లో అభివృద్ధి పనులు తగ్గి ఇబ్బంది పడుతున్నారన్న ఆయన.. వాటితో పాటు మూలన పడ్డ కాళోజీ కళా క్షేత్రం పనులు, పూర్తి కాని టెక్స్టైల్ పార్క్, ఇలా అన్ని సమస్యలు కనిపించేలా, కళ్ళు బాగా పనిచేసేలా కంటివెలుగు అద్దాలు ఇప్పించండి అంటూ వేడుకున్నారు. మీరెలాగు ఆ అద్దాలు పెట్టుకున్నారు కాబట్టి ఒక్కసారి తమ గోస చూసి పోండి... లేదంటే  అన్ని సమస్యలు తీరినట్లు కేసీఆర్ అన్నట్టు ఎటు చూసినా డల్లాస్, ఇస్తాంబుల్ లెక్క కనిపించే గ్రాఫిక్స్ కళ్లద్దాలు అయినా వరంగల్ ప్రజలకు మనిషికో జత ఇప్పించండి మంత్రిగారు అంటూ సెటైరికల్ రీతిలో రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.