- గండం దాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు
- ఉప ఎన్నికకు బ్రేక్ వేసే ప్లాన్
- వరుసగా మూడో బై ఎలక్షన్పై గురి పెట్టిన బీజేపీ
- రాజగోపాల్ చేరితే నల్గొండ, ఖమ్మంలో పట్టు
- మునుగోడులో గెలిస్తే తిరుగుండదని ఆలోచన
- ఏ పరిస్థితికైనా రెడీ అంటున్న టీఆర్ఎస్
- నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్
- బైపోల్ వస్తే వ్యతిరేకత డైవర్ట్ అవుతుందని ఎత్తుగడ
రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు సెంట్రిక్గా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరి గేమ్ను వాళ్లు ప్లే చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వస్తేనే బెటర్ అని, దీంతో తమ గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందని బీజేపీ భావిస్తున్నది. ఉప ఎన్నిక వస్తే తమ సిట్టింగ్ సీటు గల్లంతవటంతోపాటు పార్టీకి మరో దెబ్బ తగులుతుందని కాంగ్రెస్ భయపడుతున్నది. బై ఎలక్షన్ రాకుండా ఉండేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. సేఫ్ గేమ్ వైపు చూస్తున్నది. మునుగోడు ఉప ఎన్నిక వస్తే తమ పవర్ మొత్తం ప్రయోగించాలని టీఆర్ఎస్ తహతహలాడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరే గడువు ఉండటంతో.. ప్రభుత్వంపై జనానికి ఇప్పుడున్న వ్యతిరేకతను మళ్లించేందుకు డైవర్ట్ గేమ్గా ఇది ఉపయోగపడుతుందని అంచనాలు వేసుకుంటున్నది.
అన్నతో కాంగ్రెస్ లీడర్ల రాయబారం
రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు వరుసగా రెండో రోజు ఢిల్లీలోనే గడిపారు. రేవంత్రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు గురువారం ఉదయాన్నే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలో కొనసాగేలా తమ్ముడ్ని ఒప్పించాలని వెంకట్రెడ్డిని కోరారు. ఈ విషయంలో తాను తలదూర్చబోనని, ఇప్పటికిప్పుడు తాను చెప్పినా వినే పరిస్థితి లేదని వెంకట్రెడ్డి దాదాపు చేతులెత్తేసినట్లు తెలిసింది. దీంతో అన్నతో నడిపిన రాయబారం ఫెయిలైనట్లేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
హైదరాబాద్, వెలుగు : బీజేపీ వైపు అడుగులేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఎలాగైనా సరే పార్టీ వీడకుండా ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నది. అవి ఫెయిలైతే.. మునుగోడుకు బై ఎలక్షన్ రాకుండా కట్టడి చేసేందుకు అవసరమైన సేఫ్ గేమ్ వెతుక్కుంటున్నది. రాజగోపాల్రెడ్డి తనంతట తానుగా రిజైన్ చేయకముందే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనకు గండి కొట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. అప్పుడు ఆయన ఏ పార్టీలో చేరినా సరే.. ఎమ్మెల్యే పదవికి ఢోకా ఉండదని, దాంతో బై ఎలక్షన్ అవసరమే లేకుండా పోతుందని విశ్లేషిస్తున్నారు. హుజూర్నగర్, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్లో.. వరుసగా కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగిలాయి. మునుగోడులోనూ అదే రిపీటయ్యే ప్రమాదముందని పార్టీ లీడర్లు అప్రమత్తమయ్యారు. అందుకే బై ఎలక్షన్ రాకుంటేనే బెటర్ అని, అట్లయితేనే పార్టీ లీడర్లు సేఫ్గా ఉంటారని బహిరంగంగానే చర్చిస్తున్నారు. లేకుంటే సిట్టింగ్ సీటు పోవటంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏఐసీసీ నుంచి రాజగోపాల్కు పిలుపు!
పార్టీకి డ్యామేజీ జరగకముందే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన ప్రతిపాదనను ఏఐసీసీ పెద్దలు సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఒక్కరొక్కరుగా ముఖ్య నేతలను దూరం చేసుకుంటే ప్రమాదమని, పార్టీ వదలకుండా కాపాడుకోవాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న రాజగోపాల్రెడ్డితో మాట్లాడటంతో పాటు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలను ఏఐసీసీ వర్గాలు సీనియర్ నేత దిగ్విజయ్సింగ్కు అప్పగించాయి. రంగంలోకి దిగిన దిగ్విజయ్సింగ్.. రాజగోపాల్రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ పిలుపుగా రాజగోపాల్ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్లు సమాచారం. ఒకటీ రెండు రోజుల్లోనే వీరిద్దరి భేటీ జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పట్టు సాధించే పనిలో బీజేపీ
మునుగోడు బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నది. రాజగోపాల్రెడ్డిని పార్టీలో చేర్చుకోవటం ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టున్న సీనియర్ లీడర్ కమల దళంలో చేరటంతో బై ఎలక్షన్ సునాయాసంగా గెలిచే చాన్స్ ఉంటుందని భావిస్తున్నది. ఫలితంగా తమ ఎమ్మెల్యేల బలం పెరుగుతుందని ఆశిస్తున్నది. వరుసగా దుబ్బాక, హుజూరాబాద్లో గెలుపుతో బీజేపీ ట్రెండ్ తెలంగాణలో కొనసాగుతున్నది. మునుగోడు బై ఎలక్షన్ కూడా తమ ఖాతాలో పడితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీకి తిరుగుండదని బీజేపీ జాతీయ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నది. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్, రంగారెడ్డిలో పార్టీకి పట్టుందని, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేరితే దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మంలోనూ పార్టీ బలపడుతుందని బీజేపీ భావిస్తున్నది. అందుకే కాంగ్రెస్ ముందస్తుగా సస్పెండ్ చేసినా, రాజగోపాల్రెడ్డితో ఎమ్మెల్యే సభ్యత్వానికి రిజైన్ చేయించి.. బై ఎలక్షన్కే మొగ్గు చూపాలని ప్లాన్ చేసుకుంటున్నది.
డైవర్షన్కు తోడ్పడుతుందని టీఆర్ఎస్ ప్లాన్
మునుగోడుకు ఉప ఎన్నిక రాకుంటే సరే సరి అని టీఆర్ఎస్ భావిస్తున్నది! ఒక వేళ వస్తే మాత్రం తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నది. దుబ్బాక, హుజూరాబాద్లో జరిగిన డ్యామేజీని చెరిపేసేందుకు మునుగోడులో తమ అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించాలని అనుకుంటున్నది. వచ్చే ఏడాది డిసెంబర్తో టీఆర్ఎస్ పదవీ కాలం ముగుస్తుంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఎంచుకున్న పథకాలు, కార్యకలాపాలన్నీ బెడిసికొడుతున్నాయి. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు, జనం దృష్టిని మళ్లించేందుకు బై ఎలక్షన్ ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. నయానో భయానో అక్కడ గెలిచి తీరితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల భయం కూడా తమను వదిలిపోతుందనే ధీమా వారిలో వ్యక్తమవుతున్నది.