హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలోని కాసిమేడు ఫిషింగ్ హార్బర్లో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బోట్లను మత్స్యకారులు అలంకరించారు. దీనికి ముఖ్యఅతిథిగా కర్నాకట, తమిళనాడు బీజేపీ జాతీయ సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ భద్రతా బలగాలు సాధించిన విజయం చాలా గొప్పదని కొనియాడారు.
దేశ భద్రత, ఐక్యత, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ చేసిన పోరాటానికి సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అక్కడి మత్స్యకారులు, పార్టీ నేతలతో కలిసి వీక్షించారు.
