
- యాంఫోటెరిసిన్ కేంటాయింపునకు కమిటీ
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
- ఆస్పత్రులకు అమ్మొద్దని ఫార్మా కంపెనీలకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో వాడే లైపోజోమల్ యాంఫోటెరిసిన్–బి డ్రగ్ను నేరుగా పేషెంట్లకే అందించేందుకు డీఎంఈ రమేశ్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తమ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్కు ఈ డ్రగ్ అవసరమని డాక్టర్లు భావిస్తే, ఆ విషయాన్ని తెలుపుతూ కమిటీకి మెయిల్(dme@telangana.gov.in) ద్వారా సదరు హాస్పిటల్ అప్లికేషన్ పెట్టాలి. డీఎంఈ ధ్వర్యంలోని కమిటీ ఈ అప్లికేషన్ను పరిశీలించి ఆ పేషెంట్ పేరు మీద అప్రూవల్ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ను మెయిల్కే పంపిస్తుంది. ఈ లెటర్ తీసుకుపోయి డీఎంఈ సూచించిన ఫార్మా కంపెనీ స్టోర్లో చూపిస్తే, వాళ్లు వివరాలు నమోదు చేసుకుని ఆ డ్రగ్ ఇస్తారు.
నేరుగా అమ్మితే చర్యలు తప్పవు
లైపోజోమల్ యాంఫోటెరిసిన్ డ్రగ్ను హెటిరో, సిప్ల, మైలాన్, సన్ ఫార్మా, జైడస్ కాడిలా, యునైటెడ్ బయోటెక్, నియాన్ ల్యాబ్స్ సహా 17 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ కంపెనీలు అన్నింటికీ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ నోటీసులిచ్చింది. ఎన్ని డోసులు డ్రగ్ తయారు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తయారు చేసిన డ్రగ్ను ప్రైవేట్ హాస్పిటళ్లకు, సప్లయర్స్కు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తయారు చేసిన వాటిని స్టాకిస్ట్ దగ్గర ఉంచుకోవాలని, డీఎంఈ నేతృత్వంలోని కమిటీ అప్రూవల్ ఇచ్చిన వ్యక్తులకే డ్రగ్ అమ్మాలని సూచించింది. ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరింది.
గాంధీలో బ్లాక్ ఫంగస్ వార్డు ఏర్పాటు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలో బ్లాక్ ఫంగస్ పేషేంట్ల కోసం 30 బెడ్స్తో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈఎన్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రావడంతో బుధవారం నుంచి బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ రాజారావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఆపరేషన్ల నిర్వహణ, పర్యవేక్షణకు 6 విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. బ్లాక్ ఫంగస్ పేషేంట్లకు అన్నిరకాల మందులు, ఇంజక్షన్లు గాంధీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఫంగస్ బాధితుల్లో పదిమందిలో ముగ్గురికే ఆపరేషన్ చేసే పరిస్థితి రావొచ్చని చెప్పారు. ఆస్పత్రిలో 21 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారని రాజారావు తెలిపారు.