
మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27న వరల్డ్వైడ్గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన టీమ్.. గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాం. ఇందులో నటించిన ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందంలను భగవంతుడే ఈ సినిమాలోకి రప్పించాడు. ఈ సినిమాకు పరమేశ్వరుడు ఆశీస్సులు ఉన్నాయని భావిస్తున్నా’ అని అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ ‘ఈ కథను ప్రేక్షకులకు చూపించడానికి ఆ శివుడే నన్ను ఎన్నుకున్నాడని భావిస్తున్నా. ఇక ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది కూడా శివాజ్ఞతోనే జరిగింది. ఇందులో నటించిన నా మిత్రుడు ప్రభాస్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని అన్నాడు. ఈ చిత్రం ప్రతి ఒక్కరూ మెచ్చేలా ఉంటుందని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అన్నాడు. నటులు బ్రహ్మానందం, రఘుబాబు, ప్రభుదేవా, శివ బాలాజీ, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.