
- కృష్ణా, గోదావరి బోర్డుల సబ్ కమిటీలో దేశ్పాండే
- ఇంటర్ స్టేట్ సీఈ స్థానంలో ఎట్ల నియమిస్తరని ప్రశ్న
- శ్రీశైలం టూర్కు ఆయనను తీసుకెళ్లబోమన్న కేఆర్ఎంబీ సబ్ కమిటీ కన్వీనర్?
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల సబ్ కమిటీ సభ్యుడిగా సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ స్టేట్ సీఈ మోహన్ కుమార్ స్థానంలో ఆయనను నియమించినట్టుగా రెండు బోర్డుల చైర్మన్లకు రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ లెటర్ రాశారు. దీనిపై బోర్డులు అభ్యంతరం తెలిపాయి. బోర్డుల జ్యురిస్డిక్షన్ గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయడంలో భాగంగా రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. మొదట కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయగా, వాటిని సబ్ కమిటీలుగా మార్చారు. ఈ సబ్ కమిటీల్లో రెండు రాష్ట్రాల ఇంటర్ స్టేట్ సీఈలు, జెన్కో సీఈలు మెంబర్లుగా ఉండాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాల్లో నిర్ణయించారు. ఇదే విషయం మీటింగ్ మినిట్స్లో పేర్కొన్నారు. బోర్డుల నిర్ణయానికి విరుద్ధంగా ఇంటర్ స్టేట్ సీఈ స్థానంలో మరొకరిని నియమించడం సాధ్యం కాదని రెండు బోర్డులు అభ్యంతరం చెప్తున్నాయి. తెలంగాణ నుంచి కమిటీ మెంబర్ను మార్చాల్సి వస్తే దానిపై బోర్డుల సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సోమ, మంగళవారాల్లో కృష్ణా బోర్డు టీం రెండు రాష్ట్రాల అధికారులతో కలిసి శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తోంది. అయితే, ఈ టూర్కు మోహన్కుమార్ స్థానంలో శ్రీధర్రావు దేశ్పాండేను తీసుకెళ్లబోమని కేఆర్ఎంబీ సబ్ కమిటీ కన్వీనర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.