ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్యాంగ్ జౌకు వెళ్తున్న మహాన్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ ఉదయం 9 గంటల 20 నిమిషాలకు విమానం భారత భూభాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టును భారత వైమానిక దళం అప్రమత్తం చేసింది. విమానం ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరగా.. జైపూర్ లేదా చండీఘడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయాలని అధికారులు సూచించారు.కానీ విమానం ఎక్కడా ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ఇష్టపడలేదు. ఆ సమాచారం అందుకున్న భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఆ విమానాన్ని అనుసరించాయి. పైలట్ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించారు. ఇప్పుడు విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ చూపించిందని ఢిల్లీ ఏటీసీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో అనుమతించకపోవడంతో పైలట్ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించారు.
విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భారత వైమానిక దళం అప్రమత్తమై.. రెండు విమానాలను ఇరాన్ విమానం వెనుక పంపారు. అయితే, ఇప్పటి వరకు విమానంలో బాంబు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని తెలుస్తున్నది.