ఇండియాగేట్ -నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటాల ఊరేగింపు

ఇండియాగేట్ -నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటాల ఊరేగింపు

న్యూఢిల్లీ,  వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో ఊరేగింపు ఆకట్టుకుంది. అనంతరం మహంకాళి దేవాలయం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ప్రతి ఏటా ఢిల్లీలో బోనాలు నిర్వహిస్తామని అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు.

దీనిలో భాగంగానే గత తొమ్మిదేండ్లుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు, అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నట్లు వివరించారు. బుధవారం దేశరాజధాని వీధుల్లో పోతురాజుల విన్యాసాలు ఉంటాయని తెలిపారు. అలాగే అమ్మవారికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ బంగారు బోనం సమర్పించనున్నట్లు వెల్లడించారు.