అమెరికాకు పోస్టల్ సేవలు బంద్..యూఎస్ కొత్త టారిఫ్‌‌లే కారణం

అమెరికాకు పోస్టల్ సేవలు బంద్..యూఎస్ కొత్త టారిఫ్‌‌లే కారణం
  • ఆగస్టు 25 తర్వాత టెంపరరీగా రద్దు
  • యూఎస్ కొత్త కస్టమ్స్ నిబంధనలు, టారిఫ్‌‌లే కారణం

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌‌ల వేళ ఇండియన్ పోస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. అమెరికాకు పోస్టల్​సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 25  తర్వాతి నుంచి యూఎస్‌‌కు అన్ని రకాల పోస్టల్​సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఇండియన్​ పోస్టల్​ విభాగం తెలిపింది. ఈ నెలాఖరులో అమల్లోకి వచ్చే అమెరికా కస్టమ్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

జులై 30న అమెరికా  అడ్మినిస్ట్రేషన్​ జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 800 డాలర్ల (రూ. 70వేలు)  విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకున్నది. దీంతో అన్ని అంతర్జాతీయ పోస్టల్ ఐటమ్స్‌‌పై కస్టమ్స్ డ్యూటీలు విధిస్తారు. ఈ నెల 29 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.   అంతర్జాతీయ పోస్టల్ షిప్‌‌మెంట్​పై డ్యూటీలను సేకరించడానికి, చెల్లించడానికి ట్రాన్స్‌‌పోర్ట్ క్యారియర్లు లేదా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఆమోదించిన ‘క్వాలిఫైడ్ పార్టీస్’ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. 

అయితే, ‘క్వాలిఫైడ్ పార్టీస్’ ఎవరనేది, డ్యూటీ సేకరణ విధానాల గురించి స్పష్టత లేదు. అలాగే, ట్రంప్​ సర్కారు ఇటీవల విధించిన టారిఫ్‌‌ల వసూళ్లకు సంబంధించి సీబీపీ వద్ద కచ్చితమైన గైడ్​లైన్స్​ లేవు. ఈ అనిశ్చితి వల్ల ఆగస్టు 25 తర్వాత అమెరికాకు వచ్చే పోస్టల్ కన్‌‌సైన్‌‌మెంట్లను స్వీకరించలేమని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. దీంతో యూఎస్‌‌కు పంపే పోస్టల్ బుకింగ్‌‌లను ఇండియన్​ పోస్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది