
తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన బాలుడి అచూకీ సంవత్సరం తర్వాత లభించింది. మంగళవారం చందానగర్ పోలీసులు బాలున్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దొడికొండ గ్రామానికి చెందిన పి. లక్ష్మణ్ హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్లో స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్నారు. 2018 సంవత్సరం ఏప్రిల్ 24న రాత్రి తన కుమారుడు ప్రతాప్ రవి(8)తో కలిసి కాచిగూడ నుంచి కర్నూలు వెళ్లేందుకు రైలు ఎక్కాడు. రైలు ప్రయాణంలో నిద్ర పోయిన లక్ష్మణ్ జడ్చర్ల స్టేషన్ రాగానే నిద్ర లేచారు. పక్కన చూసే సరికి తన కుమారుడు లేక పోవడంతో ఆందోళన చెంది చుట్టూ గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటి నుంచి లక్ష్మణ్ తన కుమారుడి కోసం ఎక్కడ వెతికినా ప్రయోజనం లేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. మంగళవారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాన్పల్లిలో వడ్డెర వేణు భార్య కమల తన కుమారున్ని ఎండలో ఎందుకు తిరుగుతున్నావ్ అని కొట్టింది. దీంతో వేణు సోదరి బాబును ఎందుకు కొడుతున్నావ్ అంటూ గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి గొడవకు దారితీసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరా తీయగా తాము బాలుడు ప్రతాప్ రవిని పెంచుకుంటున్నామని వడ్డెర వేణు, అతని భార్య కమల పోలీసులకు తెలిపారు. పోలీసులు బాలున్ని చేరదీసి మీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అరాతీయగా తన గ్రామం దొడికొండ అని పోలీసులకు తెలిపాడు. బాలుడు చెప్పిన వివరాలతో ఎస్ఐ అహ్మద్ పాషా తెలిసిన వ్యక్తుల ద్వారా బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం సీఐ రవీందర్, ఎస్ఐలు, రమేష్, అహ్మద్ పాషాలు బాలున్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తమ కుమారుడు సంవత్సరం తర్వాత తిరిగి తమ వద్దకు చేరడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారున్ని వెతికి తమకు అప్పగించినందుకు చందానగర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.