ఉద్యోగులను, రిటైర్డ్ ఎంప్లాయిస్ ని, సోషల్ మీడియా అడిక్షన్ లో ఉన్న వాళ్లను ట్రాప్ చేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. సాధారణ మహిళలను సైతం వదలటం లేదు. డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి చివరికి బిచాణా ఎత్తేస్తున్నారు. లేటెస్టుగా కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళ వీళ్ల ట్రాప్ లో పడి లక్షల్లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఓ యాప్ ను నమ్మి మహిళ మోసపోయింది. పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తామని చెప్పి ఇన్వెస్ట్ చేయించారు. దీంతో విడతల వారీగా డబ్బులు జమచేసి లక్షా68 వేల రూపాయలు మోసపోయింది ఆ మహిళ.
గత మూడు నెలలుగా ఓ యాప్ లో ఒక్కో టాస్క్ చేస్తూ, కోరిన విధంగా డబ్బులు పంపినట్లు మహిళ పోలీసులకు చెప్పింది. పెట్టుబడి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువగా డబ్బులు జమ అయినట్లు ఆ యాప్లో చూపించారు సైబర్ మోసగాళ్లు. యాప్ లో ఉన్న డబ్బులను డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా.. విత్ డ్రా కాలేదు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు దోమకొండ పోలీసులు.
