రుచికరంగా ఉంటూనే ఆరోగ్యాన్నిచ్చే వాటిలో మిల్లెట్స్ టాప్ ప్లేస్లో ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ తినేందుకు పిల్లలు మారాం చేస్తారు. మిల్లెట్స్ అంటే చాలు ఆవడ దూరం పరిగెత్తుతారు. కాని సజ్జలతో తయారు చేసిన కట్ లెట్ ను లొట్టలేసుకుంటే లాగించేస్తారు. మరి పిల్లలకు ఇష్టమైన సజ్జల కట్ లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
కట్ లెట్తయారీకి కావాల్సినవి
- సజ్జలు: ఒకటిన్నర కప్పు
- శనగపిండి: అర కప్పు
- వాము: అర టీస్పూన్
- పచ్చి బటానీలు: రెండు కప్పులు
- జీలకర్ర, కారం, కసూరీ మేథి: ఒక్కో టీస్పూన్
- ఉల్లిగడ్డ తరుగు: ఒక కప్పు
- పచ్చిమిర్చి: రెండు
- జీలకర్ర పొడి, చాట్ మసాలా: ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
- గరం మసాలా: పావు టీస్పూన్
- ఉప్పు, నూనె: సరిపడా
- కొత్తిమీర: కొంచెం
- నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం : పచ్చిబటానీలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత పచ్చిబటానీ పేస్ట్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. ఆపై ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి.
ఒక గిన్నెలో సజ్జ పిండి, శనగ పిండి, వాము, ఉప్పు, కారం, కసూరీ మేథి వేసి కలపాలి. అందులో కొంచెం నీళ్లు పోసి ముద్దగా చేయాలి. ఆ తర్వాత చిన్న ఉండలుగా చేసి, అరచేతిలో గారెలా వత్తి లోపల స్టఫింగ్ పెట్టి మళ్లీ ఉండ చేయాలి. అలా చేసిన వాటిని కాస్త అదిమి, ఇడ్లీ ప్లేట్లో పేర్చి, దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి.
పావుగంట తర్వాత తీయాలి. అందుకోసం పాన్లో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. అందులో ఉడికించిన సజ్జ కట్లెట్లను పెట్టి రెండు వైపులా కాల్చాలి. అంతే.. వేడి వేడి కట్లెట్ రెడీ.
–వెలుగు, లైఫ్–
