నిశ్చితార్థం అయ్యాక పెళ్లి వద్దంది
కోర్టుకెళ్లిన బెంగళూరు యువకుడు
అమ్మాయి ఫ్యామిలీపై క్రిమినల్ కేసు పెట్టాలన్న కోర్టు
అప్పటికే పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేసిన యువకుడు
వాళ్లిద్దరూ మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమయ్యారు. మాటలు కలిశాయి.. మనసులు ఒక్కటయ్యాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్నారు. రెండు కుటుంబాల పెద్దలు మాటముచ్చట చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి మంచి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ, కొన్నాళ్లయ్యాక ఆ అమ్మాయి మనసు మార్చుకుంది. పెళ్లి వద్దంది. దానికి ఆ అమ్మాయి చెప్పిన కారణం, అబ్బాయిది నడ్డి ముక్కని, చాలా పొడవుగా ఉందని!!! ఆ అమ్మాయిని అబ్బాయి ఎంతో కన్విన్స్ చేశాడు. కానీ, ఫలితం లేదు. అప్పటికే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టిన ఆ యువకుడు, అమ్మాయి మీద, వారి కుటుంబం మీద కేసు పెట్టాడు. కోర్టుకెళ్లాడు. ఆ కుటుంబం మీద క్రిమినల్ కేసు పెట్టాలని కోర్టు కూడా ఆర్డర్ వేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
ఇదీ జరిగింది..
కోరమంగళలోని ఆరో బ్లాక్కు చెందిన ఓ యువకుడికి (35) మ్యాట్రిమోనియల్ సైట్లో అమెరికాలో పనిచేస్తున్న ఓ ఇండియన్ యువతి (35) పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ‘‘పోయినేడాది ఆగస్టు 13న ఆ అమ్మాయి సిటీకి వచ్చింది. ఎంజీ రోడ్లోని ఓ స్టార్ హోటల్లో లంచ్ చేశాం. మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలనుకున్నాం. తన అక్కకు నచ్చాలని ఆమె చెప్పడంతో, ఆమె అనుమతీ తీసుకున్నాం. ఆగస్టు 26న మా అమ్మానాన్నలు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉండే అమ్మాయి వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడారు. అన్నీ కుదిరాయి. సెప్టెంబర్ 9న వాళ్ల ఇంట్లో మాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది” అని ఆ యువకుడు కోర్టులో వాపోయాడు. తిరుమలలో పెళ్లి చేస్తామని అమ్మాయి వాళ్లు చెప్పడంతో, బంధువులందరూ ఇక్కడే ఉన్నారన్న కారణంతో బెంగళూరులోనే పెట్టుకుందామని చెప్పామన్నారు. అయితే, అమ్మాయి పట్టుబట్టడంతో అందుకూ ఒప్పుకున్నామని చెప్పారు. ఈ నెల 30న ముహూర్తం కూడా పెట్టుకున్నామన్నారు. ‘‘రూములను బుక్ చేసేందుకు నేను తిరుమల వెళ్లాను. లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టి 70 రూములు, కేటరింగ్ బుక్ చేశాను. రూ.4 లక్షలు పెట్టి పెళ్లి బట్టలు, గిఫ్టులు కొన్నాను. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయింది. ఏమైందో ఏమో కొన్ని రోజులకు పెళ్లి వద్దని ఆ అమ్మాయి చెప్పింది. పోయినేడాది అక్టోబర్లో మా నాన్నకు అమ్మాయి ఫోన్ చేసి పెళ్లి ఆపేయమంది” అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
నడ్డి ముక్కంది.. ఆపరేషన్ చేయించుకోమంది
అమ్మాయి పెళ్లి వద్దనడంతో అక్టోబర్ 23న తాను ఆ అమ్మాయికి ఫోన్ చేశానని ఆ యువకుడు చెప్పాడు. ‘‘నేను ఫోన్ చేసినా పెళ్లి వద్దనే చెప్పింది. నాది నడ్డి ముక్కని, చాలా పొడవుగా ఉందని వెక్కిరించింది. ఆపరేషన్ చేయించుకోమంది. నేను సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. ఎన్ని సార్లు చేసినా అవే వెక్కిరింపులు. చివరికి నా నంబర్ను బ్లాక్ చేసేసింది. వాళ్ల కుటుంబం కూడా మా ఫోన్లు ఎత్తట్లేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నన్నే కాకుండా ఇంకా వేరే వాళ్లను కూడా ఆమె మోసం చేసి ఉండొచ్చు” అని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. క్రిమినల్ కేసు పెట్టాలని కోర్టు ఆదేశాలివ్వడంతో కోరమంగళ పోలీసులు డిసెంబర్ 31న ఆ అమ్మాయి, అమ్మాయి ఫ్యామిలీ, ఆమె అక్కపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆ అమ్మాయి వివరణ కూడా తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అప్పుడే కేసు తేలుతుందంటున్నారు.