ఆస్తులు, డబ్బులకు మానవ సంబంధాలే కాదు...రక్త సంబంధాలు కూడా మంటగలిసిపోతున్నాయి. జీవితాంతం అక్కకు రక్షణకు ఉండాల్సిన ఓ తమ్ముడు భూ వివాదం కారణంగా అక్క కుటుంబంపైనే దాడి చేశాడు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డి తన సోదరితో గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో సోదరి వరి కోతను ప్రారంభించగా తమ్ముడు ఉపేందర్ రెడ్డి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. తన సోదరితో పాటు ఇద్దరు మేనకోడళ్లను, డ్రైవర్ పై ట్రాక్టర్ తో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో బాధితులు ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను కోరారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నం చేసిన ఉపేందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
