తమ్ముడు చనిపోయాడని తెలిసి గుండెపోటుతో అన్న మృతి

తమ్ముడు చనిపోయాడని తెలిసి గుండెపోటుతో అన్న మృతి

రామచంద్రాపురం/జిన్నారం, వెలుగు: తమ్ముడు చనిపోయాడని తెలిసి గుండెపోటుతో అన్న కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో చోటుచేసుకుంది. జిన్నారం మండలం మంగంపేట గ్రామానికి చెందిన చాకలి భూపాల్(38), చాకలి ముత్యాలు(48) అన్నదమ్ములు. భూపాల్​సెంట్రింగ్​పని చేస్తుండగా, ముత్యాలు పెయింటింగ్ చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం సాయంత్రం భూపాల్ సోదరుడి వరుసయ్యే చాకలి శేఖర్ తో కలిసి జిన్నారం-–మంగంపేట మార్గంలో వస్తుండగా కారు ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా భూపాల్​ మృతిచెందాడు. తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యిందని సమాచారం అందడంతో ముత్యాలు శుక్రవారం హాస్పిటల్​కు వెళ్లాడు. అక్కడ తమ్ముడు చనిపోయాడని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. డాక్టర్లు పరీక్షించి ముత్యాలు గుండెపోటుతో చనిపోయాడని నిర్ధారించారు. భూపాలుకు ఇద్దరు, ముత్యాలుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి అంత్యక్రియల నిమిత్తం రూ. 30 వేలు అందజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.