నిర్మల్​లో బీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ.. కర్రలతో దాడులు చేసుకున్న ఇరు వర్గాలు

నిర్మల్​లో బీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ.. కర్రలతో దాడులు చేసుకున్న ఇరు వర్గాలు
  • బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే యత్నం
  • జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

నిర్మల్, వెలుగు :  నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేట్ వైఎస్సార్ కాలనీలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే, బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడి జరుపుతున్నారంటూ వారిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పిడుగుద్దులతో దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. అరగంటకుపైగా రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించారు.

ఈ రెండు పార్టీల ఘర్షణ కారణంగా వైఎస్ఆర్ కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అందరినీ చెదరగొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ఓ బీజేపీ కార్యకర్త గాయపడ్డాడు. ఆయన చేయి విరిగిందని ఆ పార్టీ కార్యకర్తలు తెలిపారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓడిపోతామన్న భయంతో నే పథకం ప్రకారం బీఆర్ఎస్ లీడర్లు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదన్నారు.