కర్నాటక పోల్స్​కు బీఆర్ఎస్​ దూరం!

కర్నాటక పోల్స్​కు బీఆర్ఎస్​ దూరం!

హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్​ దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేసీఆర్​ ఫోకస్​ అం తా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఉంది. దీంతో కన్నడ నాట ఎన్నికల గురించి ప్రగతి భవన్​లో, గులాబీ క్యాంపులో ఎలాంటి చర్చ జరగలేదు. వచ్చే లోక్​సభ ఎన్నికల టైంలోనే కర్నాటకపై ఫోకస్ ​చేయాలనే ఆలోచనలో  కేసీఆర్​ఉన్నట్టు తెలుస్తోంది. కర్నాటక పోల్స్​లో జేడీఎస్​ ఒంటరిగా పోటీ చేస్తేనే మద్దతు ఇవ్వడంతో పాటు ఆ పార్టీకి ప్రచారం చేయాలని గులాబీ బాస్​ భావిస్తున్నరట. ఏదైనా పార్టీతో కలిసి జేడీఎస్ బరిలోకి దిగితే.. క్యాంపెయిన్​కు దూరంగా ఉండాలని ఆయన అనుకుంటున్నరట. కర్నాటక ఎలక్షన్​ షెడ్యూల్​ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో బీఆర్ఎస్​ఏం చేయబోతోంది ? అనే దానిపై చర్చ మొదలైంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు,  కర్నాటకలో బీఆర్ఎస్​ విస్తరణ  కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా నేతలతో కేసీఆర్​సమావేశమవుతారనే ప్రచారం సాగింది. అయితే సాయంత్రం దాకా ప్రగతి భవన్​ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు.   


జాతీయ ప్రస్థానం కర్నాటకతోనే మొదలైతదని.. 


టీఆర్ఎస్​ పార్టీ పేరును బీఆర్ఎస్​గా మార్చడానికి ముందు నుంచే.. జేడీఎస్​ నేత కుమారస్వామితో కేసీఆర్​ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. పార్టీ పేరు మార్పు.. బీఆర్ఎస్​ ఆవిర్భావ సభల్లోనూ కుమారస్వామి, రేవణ్న సహా జేడీఎస్ ​ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడంతో.. కేసీఆర్​తో ఆయనకు గ్యాప్​ వచ్చిందనే ప్రచారం సాగింది. అయితే దీన్ని కుమారస్వామి ఖండించారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ.. తండ్రి దేవెగౌడ​తర్వాత కేసీఆరే తనకు మార్గదర్శి అని ఆయన చెప్పారు. కర్నాటకలో పాదయాత్ర ఉండటంతోనే తాను ఖమ్మం మీటింగ్​కు రాలేదన్నారు. డిసెంబర్​9న నిర్వహించిన బీఆర్ఎస్​ ఆవిర్భావ సభలో కేసీఆర్​ మాట్లాడుతూ.. ‘‘రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్ని కల్లో పోటీ చేస్తం. జేడీఎస్ కు​సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటం. మన రాష్ట్ర సరిహద్దు లో ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీని గెలిపించి కు మారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. బీఆర్ఎస్​జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే మొదలైతది”అని వ్యాఖ్యానించారు.

జేడీఎస్, కాంగ్రెస్​తో కలిస్తే.. బీఆర్ఎస్​ కటీఫ్​


బీఆర్ఎస్ ​ఆవిర్భావ సభలో కుమారస్వామికి సపోర్ట్​గా కేసీఆర్​ వ్యాఖ్యలు చేసిన.. నాలుగు నెలల్లో పే సీన్​ రివర్స్​అయ్యింది. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలున్న అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.  224 స్థానాలకుగానూ 140 చోట్ల తమ పార్టీ పోటీ చేస్తుందని కుమారస్వామి స్పష్టం చేశారు. మిగతా స్థానాల్లో ఆయన ఇంకెవరికైనా మద్దతునిస్తారా.. ? కాంగ్రెస్​తో జట్టు కడతారా ? అనే చర్చ కర్నాటకలో నడుస్తోంది.  ఒకవేళ జేడీఎస్​కు కాంగ్రెస్​తో పొత్తు కుదిరితే.. కర్నాటక అసెంబ్లీ పోల్స్​కు పూర్తి దూరంగా ఉండాలని కేసీఆర్​నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జేడీఎస్ ఒంటరిగా​పోటీ చేస్తేనే మద్దతునివ్వడంతో పాటు ప్రచారానికి వెళ్లాలని.. లేదంటే లోక్​సభ ఎన్నికల వరకూ కర్నాటక  వైపు చూడాల్సిన అవసరం లేదనే ఆలోచనలో కేసీఆర్​ ఉన్నట్టు సమాచారం. తెలంగాణ సరిహద్దును ఆనుకొని ఉన్న గుల్బర్గా జిల్లాలో బీఆర్ఎస్ ​విస్తరణ కార్యక్రమాలకు నెల రోజుల క్రితమే  ఫుల్​స్టాప్​ పెట్టారు. దీంతో కర్నాటక అసెంబ్లీ పోరుకు గులాబీ పార్టీ దూరంగా ఉంటుందని తేలిపోయింది.