రేపే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. 90 మంది ఫైనల్

రేపే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. 90 మంది ఫైనల్
  • తెలంగాణ భవన్​లో ప్రకటించనున్న కేసీఆర్ 
  • లొల్లి ఉన్న చోట క్యాండిడేట్ల ప్రకటన వాయిదా 
  • సెకండ్ లిస్టులో ప్రకటించాలని నిర్ణయం
  • టికెట్లు కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో 
  • మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చర్చలు
  • ఇతర అవకాశాలు కల్పిస్తామంటూ హామీ

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులెవరో తేలిపోనుంది. అధికార పార్టీ ఫస్ట్ లిస్ట్ సోమవారం విడుదల కానుంది. 90కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని తెలిసింది. నిజానికి నాలుగైదు సీట్లు మినహా మిగతా అన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటిస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఫస్ట్ లిస్ట్ లో 90 మందికి పైగా అభ్యర్థుల పేర్లు ఉండొచ్చని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఆరు అంకె వచ్చేలా అభ్యర్థుల సంఖ్య ఉంటుందని సమాచారం. జనగామ లాగా టికెట్ల గొడవ ఉన్న సీట్లలో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసినట్టు తెలిసింది. దీనికి తోడు కమ్యూనిస్టులు కలిసొస్తే, వాళ్లకు ఇవ్వడానికి నాలుగు సీట్లు రిజర్వ్ చేస్తారని సమాచారం.

వివిధ కారణాలతో టికెట్ కోల్పోతున్న సిట్టింగ్​ఎమ్మెల్యేలను, ఆయా సీట్లు ఆశిస్తున్న నాయకులను వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్, మంత్రి హరీశ్ రావు​పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఎవరికి టికెట్​ఇచ్చినా పార్టీని గెలిపించాలని, ఎమ్మెల్యే టికెట్ దక్కనోళ్లకు ఇతర అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి, అన్ని రకాలుగా సర్దుబాట్లు అయిన నియోజవకర్గాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటించనున్నారు. 

రాజయ్యకు ఎంపీ టికెట్! 

ఎక్కువ మంది సిట్టింగ్​లకు టికెట్లు ఇవ్వడంతో పాటు జనగామ, స్టేషన్​ఘన్​పూర్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్టు ప్రగతి భవన్​నుంచే లీకులు ఇచ్చారు. సీఎం కేసీఆర్​సూచన మేరకే ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్​రెడ్డి, కడియం శ్రీహరి గ్రౌండ్​వర్క్​మొదలు పెట్టారని తెలిసింది. తమ నాయకులను తప్పిస్తారనే వార్తలతో అక్కడి సిట్టింగ్​ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్​రాజయ్య అనుచరులు ఆందోళనలకు దిగారు. సిట్టింగ్​ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. స్టేషన్​ఘన్​పూర్​నుంచి రాజయ్యను తప్పించి వరంగల్​ఎంపీ టికెట్​ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం. 

దీంతో ఫస్ట్​లిస్టులోనే ఈ సీటు ప్రకటించే అవకాశం ఉంది. జనగామ నియోజకవర్గానికి చెందిన లీడర్లను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి హైదరాబాద్​కు పిలిపించి  మీటింగ్​ పెట్టడం, ఈ మీటింగ్​కు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి హైదరాబాద్​లోనే బల ప్రదర్శనకు దిగడంతో ఈ సీటుపై వివాదం కొనసాగుతోంది. దీంతో జనగామ అభ్యర్థిని సెకండ్​లిస్టులో ప్రకటించడమే బెటర్​అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలిసింది. ఇక కల్వకుర్తి టికెట్​తనకే ఇవ్వాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్​టికెట్ దక్కకుంటే ఆయన కాంగ్రెస్​నుంచి పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కసిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​మధ్య సర్దుబాటు చేసేందుకు హైకమాండ్ ప్రయత్నం చేస్తోంది. 

సాయన్న బిడ్డ లాస్యనందితకు చాన్స్.. 

సిట్టింగ్​ఎమ్మెల్యేలను మార్చనున్న సీట్లలో కొన్నింటికి మొదటి లిస్టులోనే క్యాండిడేట్లను ప్రకటించనుండగా, మరికొన్నింటికి రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్ లను మారుస్తారని ప్రచారం జరుగుతున్న ఉప్పల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వేములవాడ, నర్సాపూర్ సీట్లకు క్యాండిడేట్లను ఫస్ట్ లిస్టులోనే ప్రకటిస్తారని.. ఇల్లెందు, వైరా, మంచిర్యాల, చొప్పదండి, జహీరాబాద్ తదితర స్థానాలను మాత్రం పెండింగ్​లో పెడ్తారని తెలిసింది. కంటోన్మెంట్​నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న బిడ్డ లాస్య నందితకు చాన్స్​ఇవ్వొచ్చని, దుబ్బాకలో మెదక్​ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డికి టికెట్​ఖరారు చేశారని సమాచారం. హుజూరాబాద్​టికెట్​పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయని.. ఫస్ట్​ లిస్టులోనే ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తారని తెలిసింది. రామగుండం, పెద్దపల్లి, మంథని, అంబర్​పేట్, ముషీరాబాద్, కోదాడ, నాగార్జునసాగర్ సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది.

కమ్యూనిస్టులకు 4 ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ.. 

కమ్యూనిస్టులతో బీఆర్ఎస్​పొత్తు ఇంకా ఖరారు కాలేదు. అయితే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో లాభం చేకూరుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐలకు రెండు చొప్పున నాలుగు ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ చేసే చాన్స్ ఉందని తెలిసింది. వాటితో పాటు రెండు పార్టీలకు ఒక్కో ఎమ్మెల్సీ సీటు ఇచ్చే యోచనలో కేసీఆర్​ఉన్నారని సమాచారం.