నెట్వర్క్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలతో కలిసి భారీ నిరసన ర్యాలీలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్ తదితరులు మాట్లాడుతూ మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ప్రజల తరఫున ‘బాకీ కార్డు’లు ఇస్తున్నామని, హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
