
- మధ్యంతర ఉత్తర్వులపై స్టే జారీకి హైకోర్టు నిరాకరణ
- కౌంటర్ వేయాలని ప్రతివాదులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలోని భూముల వ్యవహారంపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో స్టే మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. కేసుల దర్యాప్తుపై నిలిపివేత ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో, చేవెళ్ల మండలం ఎర్లపల్లిలో భూవివాదానికి సంబంధించి జీవన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మోకిలా, చేవెళ్ల పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులపై దర్యాప్తును నిలిపివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రతివాదుల వాదనల తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.
ప్రతివాదులైన పోలీసులు, పిటిషనర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సామ దామోదర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తమకు చెందిన 170 ఎకరాల్లో 93 ఎకరాలను మాత్రమే విక్రయించగా మిగిలిన భూమి తమదేనంటూ మాజీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ చైతన్య రిసార్ట్స్కు చెందిన సామ దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ ఎఫ్ఆర్లను కొట్టివేయాలని కోరుతూ జీవన్ రెడ్డి, ఆయన భార్య, తల్లి, సోదరుడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారు నుంచి తన క్లైంట్ భూమి కొనుగోలు చేశారని, ఈ భూమిపై ఆయనకు హక్కులు ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదుదారు సివిల్ కోర్టులో దావా వేశారన్నారు.
అవి పెండింగ్లో ఉండగా వాటిని క్రిమినల్ కేసులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. స్టేకు నిరాకరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్లు మొదట జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి వద్దకు విచారణకు రాగా ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు.