
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బిల్లా రంగాలకు ప్రతిరూపమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. గల్లీ పహిల్వాన్ భాషను రేవంత్ మార్చుకోవాలని, సభ్యత సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను పట్టుకొని ఎవడివిరా అని అంటున్నారని, అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
కాంగ్రెస్ లీడర్లకు కోపం వస్తే రేవంత్ సీఎం పదవి నుంచి దిగిపోతాడని హెచ్చరించారు. ఎన్నికల హామీలను గుర్తు చేస్తే అసహనం పొడుచుకు వస్తుందా అని మండిపడ్డారు. కేసీఆర్ మీద ఇలాగే మాట్లాడితే ప్రజలే రేవంత్ నాలుక చీరేస్తారని ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయలేకపోతే చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలన్నారు. ప్రధాని మోదీని రేవంత్ కలిశాక కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయట పడుతున్నాయని ఆరోపించారు. రేవంత్కు చేతనైతే రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి పోకుండా చూడాలని సూచించారు.