మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో బీజేపీ రభస

మంచిర్యాల మున్సిపల్  కార్పొరేషన్ మీటింగ్ లో బీజేపీ రభస

 

  •  నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ బీజేపీ కార్పొరేటర్ల నిరసన 
  •  కౌన్సిల్​హాల్​లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీ లీడర్ల యత్నం, స్వల్ప ఉద్రిక్తత
  •  చర్యలు తీసుకోవాలని మేయర్​ఆదేశాలు

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్​రసాభాసగా సాగింది. మేయర్​ ధర్ని మధుకర్ ​అధ్యక్షతన సోమవారం ఉదయం కౌన్సిల్​ జనరల్​ బాడీ మీటింగ్​నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ ప్లోర్​ లీడర్​ గాజుల ముఖేశ్​ గౌడ్ ​ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు బొట్ల అనిత, నాగరాజు వివిధ అజెండా అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ డివిజన్లలో తాము ప్రతిపాదించిన పనులు కాకుండా కాంగ్రెస్​ లీడర్ల ప్రపోజల్స్​కు ప్రాధాన్యం ఇస్తూ అజెండాలో ఎలా చేర్చారని ప్రశ్నించారు.

అజెండా అంశాలపై చర్చ తర్వాత ఇతర విషయాలపై చర్చించడానికి సమయం ఇస్తామని చెప్పినా వినిపించుకోలేదు. ఓవైపు వీరు నిరసన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు మేయర్​ ఆదేశాలతో అధికారులు ఎజెండా చదవడం స్టార్ట్​చేశారు. బీజేపీ కార్పొరేటర్లను సస్పెండ్​ చేస్తామని వార్నింగ్​ఇచ్చారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు మీటింగ్​ను బైకాట్ ​చేసి బయటకు వెళ్లారు. కాసేపటికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు వచ్చి మేయర్, కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌన్సిల్​ హాల్​వైపు దూసుకెళ్లారు.

వెంటనే మేయర్ ​పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ప్రమోద్​రావు వచ్చి బీజేపీ కార్పొరేటర్లను, నాయకులను బయటకు పంపించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం బీజేపీ నాయకులు నినాదాలు చేస్తూ మున్సిపల్​ఆఫీసు నుంచి ఐబీ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్​ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. అజెండాలో మొదటి అంశమైన స్వచ్ఛభారత్​ నిధులకు సంబంధించి సమావేశంలో ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు వాడుకుంటూ వాటి గురించి చర్చించకపోవడంపై తప్పుబట్టారు. కార్పొరేషన్ అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. కాగా, సమావేశానికి అంతరాయం కలిగించినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేయర్ ధర్ని మధుకర్​కమిషనర్​అన్వేశ్​ను ఆదేశించారు. 

పలు పనులకు ఆమోదం

కార్పొరేషన్​ మీటింగ్​లో వివిధ అభివృద్ధి పనులను ఆమోదించారు. మహాప్రస్థానంలో రూ.కోటితో సోలార్​ప్లాంట్​ఏర్పాటు, వాటర్​ పైపులైన్​రిపేర్లకు రూ.50 లక్షలు, వనమహోత్సవానికి రూ.50 లక్షలు, రోడ్లు, లైటింగ్​తో పాటు వివిధ అభివృద్ధి పనులకు రూ.1.80 కోట్లు, కోతులను పట్టించేందుకు రూ.15 లక్షలు కేటాయించారు. కార్పొరేషన్ ​పరిధిలో కొత్తగా 120 మంది శానిటేషన్​వర్కర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను విన్నవించగా, బీఆర్​ఎస్​కార్పొరేటర్లు నిధుల కేటాయింపులో అవకతవకలపై ప్రశ్నించారు.