హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ అర్బన్ పార్కులో ఉన్న జంగిల్ క్యాంపును అటవీశాఖ ఆధునిక వసతులతో పునరుద్ధరిస్తోంది. ఎకో-టూరిజం ప్రోత్సాహకాల్లో భాగంగా అభివృద్ధి చేసిన వసతులను పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాంపును జూలై 20 నుంచి పూర్తిస్థాయిలో సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ప్రకృతి ప్రేమికులకు అడవి వాతావరణాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతోనే దీన్ని ఎకో-టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థుల్లో ప్రకృతి, జీవవైవిధ్యంపై అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా ‘జూనియర్ రేంజర్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనిద్వారా అడవుల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు సువర్ణ వివరించారు.
