- మీ ఎమ్మెల్యేలే మాతో టచ్లోకి వచ్చారు: గట్టు రామచంద్ర రావు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లోకి వచ్చారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. ఆ నాడు కేసీఆర్ తలుచుకుని ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది కాదని విమర్శించారు. తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ తుస్సుమన్నదన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రాహుల్ గాంధీని పిలిపించుకుని రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. ప్రధాని మోదీతో రహస్య సంబంధాలు పెట్టుకుని రాహుల్ గాంధీ పరువు తీశారు. ఒక పక్క పార్టీ ఫిరాయింపుపై చట్టం తెస్తామని రాహుల్ అంటుంటే.. మరోపక్క రేవంత్ ఏమో ఫిరాయింపులకు పాల్పడిన వారిని స్టేజీపై కూర్చోబెట్టారు. కేసీఆర్ను జైల్లో పెట్టడం కాదు.. ముందు రేవంత్ను జైల్లో పెట్టాలి. ఓటుకు నోటు కేసులో
రూ.50లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. సీఎం పదవి పోయిన తర్వాత ముందుగా జైలుకు పోయేది రేవంత్ రెడ్డే. రైతుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నడు’’అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, నేతన్నలు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.