
- ఇరు పార్టీల్లో పొత్తు తెచ్చిన తంటా
- ఆర్ఎస్పీ డెసిషన్ పైనా విమర్శలు
- ఏనుగును వీడే యోచనలో పలువురు
హైదరాబాద్: కారు, ఏనుగు పొత్తుల వ్యవహారం ఇరు పార్టీలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగేందుకు రెడీ అయ్యారు. R ఇవాళ తన అనుచరులతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సాయంత్రానికి తన రాజకీయ భవితవ్యంపై క్లారిటీ ఇస్తానని చెబుతున్నారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ బాబు గెలిచారు. హరీశ్ బాబుకు 63,702 ఓట్లు రాగా కోనప్పకు 60614 ఓట్లు లభించాయి. ఇక్కడి నంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 44,646 ఓట్లు సాధించారు. తన ప్రత్యర్థితో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కోనప్ప కారు దిగనున్నారని సమాచారం. కోనేరు బాటలోనే మరో ఇద్దరు లీడర్లు ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం జరుగుతోంది.
మరో వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో జత కట్టడాన్ని దళిత సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్ష్యాలు చూపించి మరి చెండాడిన ఆర్ఎస్పీ పార్లమెంటు ఎన్నికల ముందు కేసీఆర్ తో జతకట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, మేధావులు, సామాజికవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఒక్క ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సైతం ట్విట్టర్ వేదికగా ఆరెస్పీ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. "గాడిద మీద ఎక్కి అయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాలసిందేనా? ( గాడిదకు క్షమాపణలు చెబుతున్నాను ). అన్యాయం పోలీస్ బాస్.. కరెక్టు కాదు మీ స్టెప్. ’ అంటూ ట్వీట్ చేశారు. విశారదన్ మహరాజ్ కూడా ఈ కలయికపై ఫైర్ అయ్యారు. ‘'చీకటి ' మిత్రులు ' వెలుగు ' లోకి వచ్చారు. అదేనండీ "ఆర్ఎస్పీ- కేసీఆర్ పొత్తు". అంటే, ఇన్నాళ్లు ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్పై చేసిన యుద్ధం ఒక పెద్ద బూటకం, నాటకం, పచ్చి బోగస్ అని తేలిపోయింది. అసలు రహస్యం బద్ధలైపోయింది. బహుజన వర్గాలకు ఒక స్పష్టత వచ్చింది.’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ఆర్ఎస్పీని చూసి బీఎస్పీలోకి వచ్చిన పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.