- నిజామాబాద్ జెడ్పీ మీటింగ్ను బహిష్కరించిన బీఆర్ఎస్ సభ్యులు
- జిల్లాకు వస్తున్న కేటీఆర్కు తమ బాధ తెలియాలని నిర్ణయం
- సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేయించినా
- బిల్స్ ఇవ్వడం లేదని ఆవేదన.. జెడ్పీ చైర్మన్ తీరుపైనా అసంతృప్తి
- పనులకు ఫండ్స్ లేని పదవులెందుకు?
- నిజామాబాద్ జెడ్పీ మీటింగ్ను బహిష్కరించిన బీఆర్ఎస్ సభ్యులు
నిజామాబాద్, వెలుగు: మండలాల్లో అభివృద్ధి పనులకు ఎలాంటి ఫండ్స్ కేటాయించకుండా తమకు పదవులు, ఈ మీటింగులు ఎందుకంటూ నిజామాబాద్ జెడ్పీ మీటింగ్ను జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మూకుమ్మడిగా బహిష్కరించారు. ఇందులో ఎక్కువ మంది బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారు. బుధవారం జిల్లాకు వస్తున్న మంత్రి కేటీఆర్కు తమ నిరసన తెలియాలన్న ఉద్దేశంతోనే ఇట్ల చేశామని వారు ప్రకటించారు. మండలాలకు ఫండ్స్ రాక సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు చేశామని, ఏడాదిన్నర నుంచి ప్రభుత్వం నుంచి బిల్స్ అందక అప్పులపాలయ్యామని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జెడ్పీ సమావేశం మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్లో ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లా కేంద్రానికి వచ్చిన సభ్యులు మాత్రం సమావేశానికి వెళ్లలేదు. ఒక స్టార్ హోటల్ లో భేటీ అయ్యి రెండు గంటల పాటు చర్చించుకున్నారు. అక్కడే లంచ్చేసి వెనుదిరిగారు. ఈ సందర్భంగా సభ్యులు తమ ఆవేదన వెలిబుచ్చారు. మండలాలకు జనాభా ప్రాతిపదికన 15వ ఫైనాన్స్కమిషన్ ఫండ్స్ రూ. 5 లక్షల నుంచి 20 లక్షల దాకా వస్తున్నాయని, కానీ స్టేట్ఫైనాన్స్ ఫండ్స్ రాక ఇబ్బంది పడుతున్నామన్నారు. జెడ్పీ మీటింగ్కు జిల్లా మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రావడంలేదని.. ఇక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియకే మీటింగ్కు దూరంగా ఉన్నామని తెలిపారు. ఉదయం 10 గంటలకు జనరల్బాడీ మీటింగ్ జరగాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురుచూసినా కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు జెడ్పీ చైర్మన్ విఠల్రావు ప్రకటించారు. అయితే.. సమావేశానికి కాంగ్రెస్కు చెందిన చందూర్ జెడ్పీటీసీ సభ్యుడు అంబర్సింగ్, బీజేపీకి చెందిన రెంజల్ జడ్పీటీసీ మెంబర్ రజినీ కిశోర్, బీ ఆర్ఎస్ కు చెందిన ధర్పల్లి ఎంపీపీ సరిత మాత్రమే హాజరయ్యారు. 24 మంది జెడ్పీటీసీ సభ్యులు, 26 మంది ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించారు.
చైర్మన్పై సభ్యుల్లో వ్యతిరేకత
నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవిని అప్పట్లో చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు ఆశించారు. చివరికి మాక్లూర్ జెడ్పీటీసీ సభ్యుడు విఠల్రావుకు దక్కింది. ఆయన సీఎం కేసీఆర్ కుటుంబానికి దగ్గరి వ్యక్తి కావడంతో తమకు ఇష్టం లేకపోయినా బీఆర్ఎస్సభ్యులు ఏమీ మాట్లాడలేకపోయారు. జెడ్పీ ద్వారా ఖర్చు చేసే 15 ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్నిధుల్లో 25 శాతం చైర్మన్కు, మిగతా 75 శాతం సభ్యులు పంచుకోవాలని గతంలో విఠల్రావు తెచ్చిన ప్రతిపాదనపై సభ్యులు గరమయ్యారు. ఈ విషయంలో ఏర్పడిన వివాదం పార్టీ పెద్దల మధ్యవర్తిత్వంతో సద్దుమణిగినా.. చైర్మన్ తీరుపై చాలా మంది సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు.
కేటీఆర్కు నిరసన తెలిపేందుకు ఇదే టైమ్ అని..!
మంత్రి కేటీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారులంతా కేటీఆర్ టూర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సాయంత్రం బహిరంగ సభ ఉన్నందున బీఆర్ఎస్ లీడర్లు జన సమీకరణ పనుల్లో మునిగిపోయారు. దీంతో మంగళవారం జెడ్పీ మీటింగ్ జరగకపోవచ్చని భావించారు. తొందరగా మీటింగ్ ముగించి కేటీఆర్ టూర్ ఏర్పాట్లపై దృష్టి పెడదామంటూ సభ్యులకు జెడ్పీ చైర్మన్ విఠల్రావు సమాచారం ఇచ్చారు. తమ నిరసన చెప్పడానికి ఇదే సరైన టైమ్అని భావించిన జెడ్పీటీసీ మెంబర్లు సమావేశాన్ని బహిష్కరించారు.