గిరిజనుల పంటను ధ్వంసం చేసిన బీఆర్ఎస్​ నేతలు

గిరిజనుల పంటను ధ్వంసం చేసిన బీఆర్ఎస్​ నేతలు

అచ్చంపేట, వెలుగు: కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్న గిరిజన రైతుకు చెందిన ఐదెకరాల పత్తి పంటను బీఆర్ఎస్​ నేతలు ధ్వంసం చేశారు. అచ్చంపేట మండలం ఐనూల్​ గ్రామానికి చెందిన పత్లావత్​ పత్యా, విజ్జీ గ్రామ సమీపంలో 334  సర్వే నెంబర్​లో సుభాశ్​రెడ్డికి చెందిన ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశారు. ఆదివారం రాత్రి సర్పంచ్​ కొడుకు చంద్రు మరి కొందరితో కలిసి అరకలు కట్టి పంటను ధ్వంసం చేశాడని గిరిజన రైతులు వాపోయారు. ఈ విషయమై సోమవారం ఉదయం సర్పంచ్​ కొడుకును ప్రశ్నించేందుకు వెళ్లగా తమపై దాడి చేసి, అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.\

ALSO READ :భిక్షాటన చేసిన  పంచాయతీ కార్మికులు

తహసీల్దార్, ఎస్ఐ పంటను ధ్వంసం చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపించారు. పంట వేయక ముందు అభ్యంతరం చెప్పకుండా ఇలా ధ్వంసం చేయడమేమిటని ప్రశ్నించారు. ధ్వంసం చేసిన పంటను డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ వంశీకృష్ణ పరిశీలించారు. పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తహసీల్దార్, సిద్దాపూర్​ ఎస్ఐ గిరిజన రైతులను భయపెట్టడం సరైంది కాదన్నారు. అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజన రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపారు. రాజేందర్, రామనాథం, గోపాల్​ రెడ్డి, గిరిజన రైతులు పాల్గొన్నారు.